ఏడు పోలింగ్ కేంద్రాల్లో అంతా మహిళలే....
పాట్నా: బీహార్ అసెంబ్లీకి అక్టోబర్ 16వ తేదీన జరిగే తొలి విడత ఎన్నికల్లో మొత్తం ఏడు పోలింగ్ కేంద్రాలకు మహిళా అధికారులే పూర్తిగా ప్రాతినిధ్యం వహించబోతున్నారు. పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించే అధికారి నుంచి పోలింగ్ను నిర్వహించేవారంతా మహిళలు కావడమే కాకుండా వెబ్కామ్ ఆపరేటర్ కూడా మహిళే కావడం ఈ పోలింగ్ కేంద్రాల్లో విశేషం. గయా ప్రాంతంలోనే ఈ ఏడు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. గయా కాలేజీలో నాలుగు, మహావీర్ ఇంటర్ కాలేజీలో మరో మూడు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.
పోలింగ్ ప్రక్రియకు భద్రత కల్పించే కేంద్ర బలగాల నుంచి కూడా మహిళలనే పంపించాల్సిందిగా మహిళా పోలింగ్ అధికారులు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కేంద్రం నుంచి ఇంకా నిర్ణయం వెలువడాల్సి ఉంది. అన్ని రంగాల్లో మహిళలు వెనకబడిన బీహార్ రాష్ట్రంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇదే మొదటిసారి. బీహార్ ఎన్నికల ప్రక్రియలో మహిళలు పాల్గొనడం చాలా అరదు. తామే ఎన్నికల ప్రక్రియను నిర్వహిస్తామంటూ కొంతమంది మహిళా అధికారులు స్వచ్ఛందంగా ముందుకు రావడంతో ఎన్నికల కమిషన్ వారి కోసం ప్రత్యేక అనుమతిని మంజూరు చేసింది.