మరో విమానం అదృశ్యం
వరుసపెట్టి జరుగుతున్న విమాన దుర్ఘటనలలో మరొకటి చేరింది. అల్జీరియాకు చెందిన విమానం ఒకటి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అదృశ్యం అయ్యింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు దాంతో సంబంధాలు తెగిపోయాయి. అందులో ప్రయాణికుల పరిస్థితి ఏంటోనన్న విషయం మాత్రం ఇంకా స్పష్టంగా తెలియలేదు. అందులో మొత్తం 110 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. బుర్కినాఫాస్ నుంచి అల్జీర్స్కు ఈ విమానం వెళ్తోంది. ఏహెచ్ 5017 నెంబరు గల ఈ విమానం ఏమైందన్న విషయం ఇంకా స్పష్టంగా తెలియలేదు. దాంతో విమానం ఆచూకీ కనుగొనేందుకు అధికారులు శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నారు.
నాలుగు నెలల క్రితం మలేషియా ఎయిర్లైన్స్కు చెందిన ఎంహెచ్-370 విమానం అదృశ్యం కాగా, అది ఏమైందోనన్న విషయం ఇంతవరకు తెలియరాలేదు. ఈలోపు రష్యా-ఉక్రెయిన్ సరిహద్దులలో మలేషియా ఎయిర్లైన్స్కు చెందిన ఓ విమానాన్ని క్షిపణి తాకడంతో అది కూలిపోయి అందులో ఉన్న మొత్తం 295 మంది మరణించారు. మళ్లీ ఇప్పుడు అల్జీరియాకు చెందిన విమానం అదృశ్యం కావడంతో భయాందోళనలు నెలకొన్నాయి.