మోదీ ఇక శుభవార్తలే చెపుతారట..!

మోదీ ఇక శుభవార్తలే చెపుతారట..! - Sakshi


న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇక  దేశప్రజలకు శుభవార్త అందించనున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా డీమానిటైజేషన్  తరువాత పేదల కష్టాలు తొలగిపోనున్నాయని.. 50 రోజులు సమయం ఇవ్వండి అని పదే పదే ప్రకటించిన  ప్రధాని దేశంలోని  బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం పథకాలను ప్రకటించనున్నారని  పలువర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా  నిరుపేదలు, రైతులు, చిన్న వ్యాపారులు, మహిళలకు శుభవార్త అందించనున్నారని పేర్కొంటున్నారు. శనివారం జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని  న్యూ ఇయర్ వేడుకలో  వీరి అభ్యున్నతికోసం కొన్ని చర్యల్ని ప్రకటించవచ్చని భావిస్తున్నారు.



ప్రధానంగా  డీమానిటైజేషన్ కు ప్రజల అందించిన సహకారానికి ప్రజలకు ధన్యవాదాలు చెప్పడంతో పాటు ఈ  ఇబ్బందులను తగ్గించే ఉపశమన చర్యల్ని ప్రకటించనున్నారు. ముఖ్యంగా పెద్దనోట్ల రద్దుతో ఇబ్బందుల పాలైన చిన్న,మధ్య తరగతి వ్యాపారస్తులకు  ఉపశమన చర్యల్ని ప్రకటిస్తూ  కొన్ని విధాన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశాలున్నాయని సమాచారం.  మహిళలు, రైతులు, మధ్య,  చిన్న వ్యాపారులను  దృష్టిలో పెట్టుకొని ఆకర్షించే ప్రకటనలు చేయనున్నారు.


దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు  సంవత్సరం పాటు ఉచిత గ్యాస్ సిలిండర్ల సరఫరా

వివిధ వ్యాపార రంగాలకు  ప్యాకేజెస్

మధ్యతరగతికి ప్రత్యక్ష పన్ను ఉపశమనం కల్పించే అవకాశం

డీబీటీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్) సేవలు విస్తృతం

బినామీ ఆస్తులపై చర్యలు




దాదాపు 100 మిలియన్ చాలా పేద కుటుంబాలకు ఆదాయపు బదిలీ పథకం (గ్రామీణ, పట్టణ ప్రాంతాలు) రాబోయే 3-4 సంవత్సరాలలో పేదరికం నుంచి 1 మిలియన్ పేద కుటుంబాలకు మోక్షం కల్పించే పథకం. ఇప్పటికే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సామాజిక ఆర్థిక కుల గణాంకాల సేకరణ (ఎస్ఇసిసి) ద్వారా  వీరిని గుర్తించారు.


డిజిటల్ ఎకానమీ సాధనలో డీబీటీ మరింత ప్రోత్సాహాన్ని అందించే చర్యల్లో భాగంగా నిర్దేశించిన పథక  ఫలాలు నేరుగా లబ్ధిదారులకు చేరుకోవడానికి వీలుగా డీబీటీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్) విస్తృత వినియోగంపై  నొక్కి వక్కాణించనున్నారు.


మరోవైపు  డీబీటీ  ద్వారా మార్చి 31, 2017 నాటికి మరో 200 పథకాలను  ప్రారంభించనున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.   2017 ఏడాది చివరికి మరో 500  పథకాలను చేర్చనున్నట్టు  ఈ నేపథ్యంలో  2017-18 బడ్జెట్   "అత్యంత ప్రజాకర్షకం'గా  ఉండనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.



2022 నాటికి గ్రామీణ, పట్టణ పేదలకు  ఇల్లు, ఆరోగ్యం, విద్య, లాంటి కనీస అవసరాలు కల్పించాలని తమ ప్రభుత్వం ధ్యేయమని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పడాన్ని పలువురు ఉదహరిస్తున్నారు. అయితే శుక్రవారం నాటి ప్రసంగంలో  అవినీతిపరులు పేదలను, మధ్య తరగతి ప్రజల్ని దోచుకుంటున్నారని మండిపడ్డారు. అవినీతి, నల్లధనంపై పోరాటాన్ని మళ్లీ పునరుద్ఘాటించడం విశేషం.  అన్నిటికంటే ముఖ్యంగా ఇటీవల ప్రకటించినట్లుగా బినామీ ఆస్తులపై చర్యలకు ప్రధాని ఓ కీలక ప్రకటన చేయవచ్చని తెలుస్తోంది. అయితే దేశ ప్రజానీకం నెత్తిన మరో బాంబు పేల్చుతారా.? లేక ఉపశమనం కల్పిస్తారా? అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top