భర్తని వదిలి వస్తే ప్రియుడు ఇలా..
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): కన్నవారి పరిస్థితులకు తలొగ్గి మూడు ముళ్లు వేయించుకుంటే.. నువ్వే కావాలని ప్రియుడు వెంటపడ్డాడు. ప్రేమను చంపుకోలేక భర్తను వదిలి వచ్చేసింది. అమ్మానాన్నలు వద్దంటున్నారని ప్రియుడు ముఖం చాటేశాడు. దీంతో బాధితురాలు ప్రియుడి ఇంటి ముందు బైఠాయించింది. పెద్దంపేట గ్రామానికి చెందిన పోలుదాసరి జ్యోతిని అదే గ్రామానికి చెందిన పెర్గు శివకుమార్ పెళ్లి చేసుకుంటానని శారీరకంగా లోబర్చుకున్నాడు.
వీరిద్దరి కులాలు వేరు కావడంతో శివకుమార్ తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోలేదు. జ్యోతి తల్లి చనిపోవడంతో తండ్రి ఓదెలు పెంచి పెద్ద చేశాడు. తనకు ఆడ తోడు లేకపోవడం, ఆర్థికంగా వెనకబడిపోవడంతో గ్రామానికి చెందిన బంధువుల అబ్బాయితో జ్యోతి వివాహం చేశాడు. అత్తగారింటికి వెళ్లిన జ్యోతిని శివకుమార్ తిరిగి రమ్మని తరచూ ఫోన్ చేశాడు.
భర్తతో కాపురం చేయలేక.. ప్రియుడి కోసం పెద్దంపేటకు చేరుకుంది. తీరా శివకుమార్ తన తల్లిదండ్రులు కాదంటున్నారని తేల్చి చెప్పడంతో జ్యోతి ప్రియుడి ఇంటిముందు దీక్ష చేపట్టింది. శివకుమార్తో జీవిస్తానని జ్యోతి తేల్చి చెబుతోంది. జ్యోతి తండ్రిని వివరణ కోరగా.. నా బిడ్డకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టారు.