చైనాను అనుకరించాల్సిన అవసరం లేదు:మోడీ
న్యూఢిల్లీ: భారతీయువల శక్తి సామర్థ్యాలపై తనకు అపారమైన నమ్మకం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ప్రధాని బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి అంతర్జాతీయ మీడియాకు ఇంటర్యూ ఇచ్చిన మోడీ.. ప్రజాస్వామ్యం అనేది భారతీయుల డీఎన్ఏలోనే ఉందని తెలిపారు. బాలికల విద్య ద్వారానే మహిళల స్వాలంబన సాధ్యమవుతుందన్నారు. ఇస్లామిక్ ఉగ్రవాదుల ముస్లింలకు ప్రతినిధులు కాదని తెలిపారు. ఉగ్రవాదం అనేది మానవత్వానికి ఒక సవాలు వంటిదని మోడీ స్పష్టం చేశారు. భారత్-అమెరికాల మధ్య చాలా సామీప్యతలున్నాయన్నారు. భారత ముస్లింలు దేశం కోసమే జీవిస్తారని, అవసరమైతే భారత్ కోసం ప్రాణాలిస్తారని తెలిపారు. ఉగ్రవాదులు ఆడమన్నట్లు భారతీయ ముస్లింలు ఆడరని ఆయన అన్నారు.
భారత్- చైనాను అనుకరించాల్సిన అవసరం లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. భారత్ తిరిగి స్వయం శక్తివంతమవుతుందన్నారు. అయితే ఇందుకు కఠినమైన పరిశ్రమ కావాల్సిందేనన్నారు. చైనా మాత్రం ఒంటరిగా జీవించలేదని.. పొరుగుదేశాలతో కలిసి అడుగు వేయాల్సిందేనని మోడీ తెలిపారు. పుస్తకాలు తన నేస్తాలని.. తానెప్పుడూ ఏకాకని అనుకోలేదన్నారు.