సీఎం ఆఫీసు వద్ద విషాదం

సీఎం ఆఫీసు వద్ద విషాదం


లక్నో: ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి కార్యాలయం(లోక్‌ భవన్‌) వద్ద విషాదం చోటుచేసుకుంది. విస్తరణ పనుల్లో భాగంగా ఏర్పాటు చేసిన భారీ ఇనుపగేటు మీద పడటంతో తొమ్మిదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. మృతురాలి తల్లి నిర్మాణ పనుల్లో కూలిగా పనిచేస్తోంది. అక్కడే ఏర్పాటు చేసిన తాత్కాలిక గుడారంలో వీరు నివసిస్తున్నారు.



బుధవారం ఉదయం నుంచి లక్నోలో భారీ వర్షం కురుస్తుండటంతో పనులు జరగలేదు. సాయంత్రానికి వర్షం తగ్గడంతో ఆట నిమిత్తం పాప బయటికొచ్చి అనూహ్యంగా ప్రమాదానికిగురైంది. తీవ్రంగా గాయపడిన పాపను ఆస్పత్రికి తీసుకెళ్లగా, చికిత్స పొందుతూ కొద్దిసేపటికే కన్నుమూసింది. అంతకు ముందురోజే నిలిపిన భారీ ఇనుపగేటు.. వర్షం కారణంగా పడిపోయి ఉండొచ్చని అధికారులు అన్నారు. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ స్పందించాల్సిఉంది.



లోక్‌భవన్‌కు భారీ హంగులు

యూపీ సీఎం కార్యాలయమైన లోక్‌భవన్‌ను భారీ ఎత్తున విస్తరించే పనులు 2016లో(అఖిలేశ్‌ హయాంలో) ప్రారంభమయ్యాయి. సుమారు ఆరున్నర ఎకరాల ప్రాంతంలో రూ.602కోట్ల వ్యయంతో భారీ నిర్మాణాలు చేపట్టారు. ఇప్పుడున్న కార్యాలయం చిన్నదిగా ఉండటంతో మరింత సౌకర్యవంతమైన, విశాలమైన భవంతులను కడుతున్నారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top