500 మంది రిటైర్డ్ ఎస్సైలు తిరిగి నియామకం!
బెర్మాపూర్(ఒడిశా): రాష్ట్రంలోని పదవీ విరమణ పొందిన 500 మంది సబ్ ఇన్ స్పెక్టర్లు తిరిగి తమ పదవుల్లో కొనసాగేందుకు మార్గం సుగుమం అయ్యింది. ఈమేరకు రాష్ట్ర డీజీపీ సంజీవ్ మారిక్ పంపిన నివేదికకు గురువారం ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఇప్పటి వరకూ ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 58 సంవత్సరాల మాత్రమే ఉండేది. అయితే ఉద్యోగుల పదవీ విరమణ వయసును మరో రెండు సంవత్సరాలు పెంచుతూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకోవడంతో అది కాస్తా 60 సంవత్సరాలకు చేరింది.
ఇదే నిబంధనలు పోలీస్ శాఖకు కూడా వర్తించినా.. అత్యవసర పరిస్థితుల్లో పోలీస్ శాఖలోని అధికారుల వయో పరిమితిని రెండు సంవత్సరాలు పాటు పెంచే వెసులుబాటు ఉండటంతో ఆ దిశగా డీజీపీ చర్యలు చేపట్టారు. ఆ క్రమంలోనే 500 మంది రిటైర్డ్ ఎస్సైలను తిరిగి నియమించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీనికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో ఆ ఎస్ఐలు త్వరలోనే తమ బాధ్యతలను తిరిగి చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఈ విధానం పోలీస్ శాఖలోని ఉద్యోగుల కొరతను నివారించేందుకు ఉపయోగపడుతుందని డీజీపీ స్పష్టం చేశారు.