నరమేధానికి తొమ్మిదేళ్లు

నరమేధానికి తొమ్మిదేళ్లు

దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో ముష్కర మూకలు మారణహోమం సాగించి తొమ్మిదేళ్లు గడిచాయి. పది మంది పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మూడు రోజుల పాటు సృష్టించిన నరమేధంలో విదేశీయులతో సహా 166 మంది బలైపోయారు. 300 మంది క్షతగాత్రులయ్యారు. అరేబియా మహాసముద్రం మీదుగా ముంబైలోకి చొచ్చుకొచ్చిన నర రూప రాక్షసులు వాణిజ్య రాజధానిని వాల్లకాడులా మార్చారు.

 

లియోపోల్డ్ కేఫ్, తాజ్‌మహల్ ప్యాలెస్ హోటల్, ట్రైడెంట్ ఒబెరాయ్, నారిమాన్ హౌస్, ఛత్రపతి శివాజీ టెర్మినస్‌, కామా ఆస్పత్రుల్లో మారణకాండ సృష్టించారు. 50గంటల సుదీర్ఘ పోరాటం తర్వాత ఉగ్రవాదులను భారత భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. సజీవంగా పట్టుబడిన ఉగ్రవాది అజ్మల్ కసబ్ ను దాదాపు నాలుగేళ్ల పాటు విచారించి 2012 నవంబర్ 21న ఉరితీశారు. ముంబైపై ఉగ్రదాడి జరిగి తొమ్మిదేళ్లు గడిచినప్పటికీ ఆ భయానక దృశ్యాలు జాతి జనులకు ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి.

 

26/11 ఉగ్రదాడికి తొమ్మిదేళ్లు నిండిన సందర్భంగా దాడిలో కోలుకోలేని దెబ్బ తిన్న 26 కుటుంబాలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించేందుకు మహారాష్ట్ర సర్కారు సిద్ధమైంది. ఈ కార్యక్రమాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రారంభిస్తారు. ఈ వీడియోలను వీక్షించేందుకు సెలెక్టెడ్ ఆడియన్స్ కు మాత్రమే అనుమతి ఉంది.

 

దాడుల క్రమం

* 2008, నవంబర్ 26వ తేదీ సాయంత్రం అరేబియా మహాసముద్రం మీదుగా ముంబై కొలాబా తీరంలోకి ఉగ్రవాదులు చొరబడ్డారు.

* మూడు బృందాలుగా విడిపోయి తమ తమ లక్ష్యాల దిశగా అడుగులు వేశారు.

* ఉగ్రవాదులు అబ్దుల్ రెహమాన్, అబూ అలీ, అబూ సోహెబ్‌లు కొలాబాలోని లియోపోల్డ్ కేఫ్ వైపు వెళ్లారు.

* అబ్దుల్ రెహమాన్ చోటా, ఫహదుల్లాలు ట్రైడెంట్ ఒబెరాయ్ వైపు వెళ్లారు.

* నాసిర్ అబూ ఉమర్, బాబర్ ఇమ్రాన్ అలియాస్ అబూ ఆకాశలు నారిమాన్ హౌస్ వైపు వెళ్లారు.

* స్మాయిల్ ఖాన్, అబూ ఇస్మాయిల్, అజ్మల్ ఆమిర్ కసబ్‌లు ఛత్రపతి శివాజీ టెర్మినస్‌, కామా ఆస్పత్రి దిశగా ముందుకుసాగారు.

* ఛత్రపతి శివాజీ టెర్మినస్, హోటల్ తాజ్‌మహల్ ప్యాలెస్, హోటల్ ట్రైడెంట్, నారిమాన్ హౌస్, లియోపోల్డ్ కేఫ్, కామా ఆస్పత్రి, వాడిబందర్ తదితర ప్రాంతాల్లో నరమేధం సృష్టించారు.

* ఉగ్రవాదుల కాల్పుల్లో మహారాష్ట్ర ఏటీఎస్ చీఫ్ హేమంత్ కర్కరే సహా పలువురు పోలీసులు, పౌరులు మృతి చెందారు.

* 50 గంటల సుదీర్ఘ పోరాటం తర్వాత భారత భద్రతా బలగాల చేతిలో తొమ్మిది మంది ఉగ్రవాదుల హతమయ్యారు.

* 2008 నవంబర్ 27వ తేదీ తెల్లవారుజామున గిర్గావ్ చౌపాటీ వద్ద అజ్మల్ కసబ్‌ ను అధికారులు అరెస్టు చేశారు.

* ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ తో కలిసి దర్శకుడు రాంగోపాల్ వర్మ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. 

* ముంబై ముట్టడికి బాధ్యతవహిస్తూ ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్, హోంమంత్రి ఆర్‌ఆర్ పాటిల్ లు రాజీనామా చేశారు.

* నాలుగేళ్ల న్యాయ విచారణ అనంతరం 2012 నవంబర్ 21న పూణెలోని ఎరవాడ జైల్లో అజ్మల్ కసబ్ కు ఉరిశిక్ష అమలయ్యింది.
Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top