పాక్ చెరలో 18 మంది భారత జాలర్లు
తమ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించారని ఆరోపిస్తూ పాకిస్థాన్ తీర రక్షక దళం 18 మంది భారతీయ జాలర్లను అరెస్టుచేసింది. ఆదివారం రాత్రి కరాచీ తీరానికి సమీపంలో పాక్ రక్షక దళాలు భారత జాలర్లను అరెస్టుచేయడంతోపాటు వారి పడవలను స్వాధీనం చేసుకున్నట్లు జీయో న్యూస్ వార్తలను ప్రసారం చేసింది.
అయితే అరెస్టయిన వారిని కోర్టులో ప్రవేశపెట్టకుండా రహస్య ప్రదేశానికి తరలించారని తెలిసింది. జాలర్లను అరెస్టు చేసిన వెంటనే కోర్టు ముందు ప్రవేశపెట్టడం ఇరుదేశాలూ ఆనవాయితీగా పాటిస్తున్నదే. కాగా జాలర్ల సమాచారాన్ని వెల్లడించేందుకు పాక్ అధికారులెవరూ ముందుకురాలేదు.