తునాతునకలైన బస్సు.. 18 మంది దుర్మరణం

200 మీటర్ల లోయలో పడిపోవడంతో ముక్కలుముక్కలైన బస్సు - Sakshi


షిమ్లా: హిమాచల్ప్రదేశ్లో ఘోర విషాదం జరిగింది. హిందుస్థాన్ టిబెట్ నేషనల్ హైవేపైనుంచి ఒక బస్సు 200 మీటర్ల లోయలోకి పడి తునాతునకలైంది. బుధవారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో 18 మంది ప్రయాణికులు దుర్మరణం చెందగా, మరో 20 మందికి తీవ్రగాయాలయ్యాయి. కిన్నార్ జిల్లా ఎస్పీ రాహుల్ నాథ్ తెలిపిన వివరాల ప్రకారం..



దాదాపు 50 మంది ప్రయాణికులతో రెకొంగ్ పోయ్ నుంచి రాంపూర్ వెళుతున్న బస్సు.. హిందుస్థాన్- టిబెట్ జాతీయ రహదారిపైగల నాథ్పా వద్ద ప్రమాదవశాత్తు 200 మీటర్ల లోయలోకి పడిపోయింది. అంత ఎత్తునుంచి పడటంతో బస్సు ముక్కలుముక్కలుగా విరిగిపోయింది. 15 మంది అక్కడికక్కడే మరణించగా, మరో ముగ్గురు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. పెద్ద శబ్ధం వినిపించడంతో ప్రమాద స్థలికి చేరుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించి, క్షతగాత్రులను బయటికి తీశారు. మృతుల్లో ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారు.



కాగా, బస్సు పడిపోయిన ప్రదేశానికి కొద్ది అడుగుల దూరంలోనే సట్లైజ్ నది ఉంది. ఒకవేళ బస్సు నదిలో పడి పోయి ఉంటే మృతుల సంఖ్య మరింత పెరిగి ఉండేదని పోలీసులు చెప్పారు. క్షతగాత్రులను రాంపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని, వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందన్నారు. ప్రత్యక్షసాక్షి కథనం ప్రకారం ఎదురుగా వెళుతున్న వాహనాన్ని బస్సు డ్రైవర్ ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలోనే ఈ ఘోరప్రమాదం జరిగినట్లు తెలిసింది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top