సాహోరే గుడివాడ బామ్మ..యూ ట్యూబ్‌ సెన్సేషన్‌

సాహోరే గుడివాడ బామ్మ..యూ ట్యూబ్‌  సెన్సేషన్‌


సాంప్రదాయ రుచికరమైన  వంటల తయారీలో గుడివాడ మస్తానమ్మ స్టయిలే వేరు. సెంచరీ దాటేసిన ఈ గ్రానీ  ప్రస్థానం తెలిస్తే అంతా  ఔరా అనుకోవాల్సిందే. అవును 106 ఏళ్ళ  వయసులో చలాకీగా, తన పనులు  తను చేసుకుంటూ నోరూరించే వంటకాలతో, టాలెంట్‌  ప్రదర్శిస్తూ యూ ట్యూబ్‌ సంచలనంగా మారిపోయింది.   'కంట్రీ ఫుడ్స్' పేరుతో  సొంత ఛానెల్‌ను నడుపుతున్న  ఈ బామ్మ లక్షల ఫాలోయర్స్‌తో దుమ్మురేపుతోంది.  

 



ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా గుడివాడకు చెందిన  మస్తానమ్మ యూట్యూబ్‌ స్టార్‌.. యూ ట్యూబ్‌   సెన్సేషన్‌.  తన వంట ట్యుటోరియల్స్‌ తో  యూట్యూబ్‌ లో సునామీ సృష్టిస్తోంది. కంట్రీ ఫుడ్స్ ఛానల్ లో రకరకాల వంటల నైపుణ్యంతో  గుడివాడ బామ్మ సూపర్‌ పాపులర్. ఆమె చేతి వంటకాల లిస్ట్‌  ఒకటా రెండా.. చాలా పెద్దదే.  ఎగ్ దోశ, ఫిష్ ఫ్రై ,  పాయా, అరటి ఆకులతో చేసే స్పెషల్‌ ఫిష్‌​  ఫ్రై, బ్యాంబూ చికెన్ బిర్యానీ లాంటి ఇతర వంటకాలను సులభంగా వండేస్తోంది.  ముఖ్యంగా ఈమె వంటకాల్లో వాటర్‌ మిలన్‌ చికెన్‌ ప్రత్యేకమైందనే చెప్పాలి. ఈ ఒక్క వీడియేకే  66లక్షల వ్యూస్‌ వచ్చాయంటేనే ఇది ఎంత పాపులరో అర్థం చేసుకోవచ్చు.  ఈ వెరైటీ వంటకాలతో అమెరికా, బ్రిటన్‌, దుబాయ్‌లలలో కూడా  ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పెరిగింది.  అక్కడున్న బంధువులు ఫోన్‌ చేసి మరీ మస్తానమ్మ వంటకాలపై  ప్రశంసలు కురిపించారట.



ఒక ఆకలితో ఉన్న రాత్రి తాను, తన ఫ్రెండ్స్‌ కొంత ఆహారాన్ని సిద్ధం చేసుకున్న సందర్భంలో తాము కూడా  యూ ట్యూబ్‌ ఛానల్‌  ఓపెన్‌ చేయాలనే ఆలోచన వచ్చిందట  మస్తానమ్మ మనువడు లక్ష్మణ్‌ కి.   ఇలా మొదలు పెట్టిన ఫస్ట్‌ వీడియోనే వైరల్‌గా మారడంతో మరింత ఊత్సాహంగా దీన్ని ముందుకు నడిపించారు. ఇతనికి అమ్మమ్మ వెరైటీ రెసిపీలు మరింత సహాయం  చేశాయి. ఇక అంతే అప్పటినుంచి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. అయితే మొదట్లో ఆమె వీడియోలను షూట్‌ చేస్తోంటే తనకు ఏమీ అర్థంకాలేదని, కానీ  అసలు విషయం తెలిసిన తరువాత చాలా హ్యాపీ ఫీల్‌ అయ్యిందని  లక్ష్మణ్‌ వివరించారు.   అంతేకాదు.. ఇటీవల 106 వ పుట్టినరోజు సందర్భంగా  చీరలు, గ్రీటింగ్‌ కార్డులు లాంటి బోలెడన్ని బహుమతులు అందుకుందట గ్రాండ్‌మా.  ముఖ్యంగా పాకిస్తాన్‌ ఇస్లామాబాద్‌కు చెందిన  ఓ ఫ్యాన్‌ చీరను పంపించారంటూ లక్ష్మణ్‌  చెప్పుకొచ్చారు.



 ఇంతకీ ఈ బామ్మకు యూ ట్యూబ్ ఫాలోయర్ల సంఖ‍్య ఎంతో తెలుసా. సుమారు 2 లక్షల 48వేలమంది సబ్ స్కైబర్లు.  ఈ సంఖ్య ఇంకా పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. లేటు వయసులో  లేటెస్ట్‌ సంచలనంగా మారిన  మస్తానమ్మకు మనం కూడా సాహో అనాల్సిందే. మరి ఇంకెందుకు ఆలస్యం వాటర్‌ మిలన్‌ చికెన్‌  వీడియోపై ఒక  లుక్కేసుకుంటే పోలా..













Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top