ఆరోగ్యశ్రీ సమ్మెకు వైఎస్సార్ సీపీ మద్దతు
వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యశ్రీ ఔట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. వారి న్యాయమైన సమస్యల పరిష్కారానికి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. లోటస్పాండ్లోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ ఉద్యోగులకు బీమా పథకం పెట్టాలని కోరారు. తమ న్యాయమైన కోర్కెలు తీర్చాలని ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేయడం తగదన్నారు. ఒక సదాశయంతో వైఎస్ పెట్టిన పథకాన్ని మరింత మెరుగులు దిద్ది రోగులకు చేరువ చేయాల్సింది పోయి నిర్వీర్యం చేసే విధంగా వ్యవహరించటం తగదన్నారు. నిండు శాసనసభలో ప్రకటించిన లక్షకు పైచిలుకు ఉద్యోగాలకూ, శనివారం సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపిన 15 శాఖల్లోని 15 వేల ఉద్యోగాలకూ పొంతన లేదన్నారు. మిగతా ఉద్యోగాలు మాటేమిటని తాము ప్రశ్నిస్తున్నామన్నారు.