'ఆ ఘనత వైఎస్సార్‌ కుటుంబానిదే'

'ఆ ఘనత వైఎస్సార్‌ కుటుంబానిదే' - Sakshi


వైఎస్సార్‌సీపీ ఉమ్మడి మెదక్‌ జిల్లా అధ్యక్షుడు గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డి



నర్సాపూర్‌ రూరల్‌: ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ఘనత వైఎస్సార్‌ కుటుంబానికే దక్కుతుందని వైఎస్సార్‌సీపీ ఉమ్మడి మెదక్‌ జిల్లా అధ్యక్షుడు గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. వైఎస్‌ జగన్‌ను జైలులో పెట్టిన సమయంలో.. తట్టుకోలేక ఆత్మ హత్యకు పాల్పడిన మెదక్‌ జిల్లా నర్సాపూర్‌కు చెందిన పొట్టి వీరారెడ్డి కుటుంబానికి మంగళవారం వైఎస్సార్‌సీపీ తరఫున రూ.లక్ష చెక్కును ఆయన అందజేశారు. శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్‌ మృతిని తట్టుకోలేక మెదక్‌ జిల్లాలో ప్రాణాలు వదిలిన కుటుంబాలను ఓదార్చేందుకు వైఎస్‌ షర్మిల జిల్లాకు వచ్చిన సమయంలో.. నర్సాపూర్‌కు చెందిన పొట్టి వీరారెడ్డి ఆత్మహత్యకు పాల్పడిన విషయాన్ని తెలుసుకున్నారన్నారు.



ఓదార్పు యాత్రలో భాగంగా హత్నూర మండలంతోపాటు నర్సాపూర్‌లోని వైఎస్సార్‌ విగ్రహా నికి పూలమాల వేసిన షర్మిల దృష్టికి స్థానికులు ఈ విషయాన్ని తీసుకెళ్లారన్నారు. వీరారెడ్డి భార్య నవీన, పిల్లలు అనుష్క, పల్లవిలను షర్మిలతో కలిపించగా, వీరారెడ్డి కుటుంబాన్ని ఆదుకుంటామని ఆమె హామీ ఇచ్చారని శ్రీధర్‌రెడ్డి తెలిపారు. అందులో భాగంగానే వీరారెడ్డి కుటుంబానికి వైఎస్సార్‌సీపీ తరఫున రూ. లక్ష ఆర్థిక సహాయాన్ని తనతో పంపించారని చెప్పారు. పార్టీ అభిమానులకు ఏ సమస్య తలెత్తినా.. వైఎస్సార్‌ కుటుంబంతోపాటు పార్టీ ఎప్పుడూ అందుబాటులో ఉండి ఆ సమస్య పరిష్కారంలో ముందుంటుందని శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top