రోడ్డుప్రమాదంలో వ్యక్తి మృతి
మేడ్చల్ (రంగారెడ్డి జిల్లా) : 44 వ జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ యువకుడు చికిత్స పొందుతూ గురువారం మరణించాడని మేడ్చల్ పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. రావల్కోల్ గ్రామానికి చెందిన దగ్గు మల్లేష్(28),రవి, సుదర్శన్ అనే ముగ్గురు యువకులు పల్సర్ బండిపై గ్రామం నుండి మేడ్చల్ కు వెళ్తుండగా రేకులబావి వద్ద జాతీయరహదారిపై కారు ఢీ కొనడంతో ముగ్గురు యువకులకు గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడ్డ మల్లేష్ నగరంలోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మరణించాడు. ఈ మేరకు మేడ్చల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.