మీ ఇంటికే సర్వీస్ ఆటో
-
ఫోన్ కాల్తో అందుబాటులోకి -
రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి
బషీర్బాగ్: అత్యవసరంగా మీరు బయటకు వెళ్లాలి. రోడ్డు పక్క వేచి చూస్తే ఎంత సేపైనా ఒక్క ఆటో కనిపించడం లేదు. అవతల సమయం మించిపోతోంది. ఏం చేయాలో తోచడం లేదు.... సాధారణంగా చాలామంది ఎదుర్కొనే సమస్య ఇది. మనకు అవసరమైన సమయానికి ఆటోలు, ఇతర వాహనాలు అందుబాటులో లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో చెప్పక్కరలేదు... ఇక ముందు ఈ ఇబ్బందులు ఉండబోవని భరోసా ఇస్తున్నారు ఐటీ బకెట్ కన్సల్టెంట్ సర్వీసెస్ వారు.
బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో ఐటీబకెట్ కన్సెల్టెంట్ సర్వీసెస్ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి ఈ వివరాలు వెల్లడించారు. ఒక్క ఫోన్ కాల్ చేస్తే సర్వీస్ ఆటో రిక్షా మనం ఎక్కడుంటే అక్కడికి వస్తుందని ఆయన చెప్పారు. హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలలో ఇది తొలిసారిగా ప్రారంభించామని తెలిపారు. ప్రయాణికులకు భద్రతతో పాటు, ప్రభుత్వం నిర్ణయించిన రేటుకే ఈ ఆటో అందుబాలో ఉంటుందని చెప్పారు. ప్రయాణికులకు బీమా సౌకర్యం ఉంటుందన్నారు.
పాఠశాలలు, కార్యాలయాలకు స్పెషల్ ప్యాకేజీలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. సెల్ నెంబర్ 77068 00008కి ఫోన్ లేదా ఎస్ఎంఎస్ ఇవ్వవచ్చని అన్నారు. ఆన్లైన్లోనూ (డబ్ల్యూడబ్ల్యూడబ్లూ.ఐటిబకెట్.ఇన్) ఆటోలు బుక్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, నిర్వాహకులు శ్రీశైలం జంగితాల, దేవేందర్, సుమితి కుమార్ తదితరులు పాల్గొన్నారు.