నువ్వు నాకు నచ్చలేదు!
- ప్రేమించి పెళ్లాడి.. వేధింపులు
- పెళ్లయిన రెండు నెలలకే యువతి ఆత్మహత్య
సిద్దిపేటరూరల్: వాళ్లు పదేళ్లుగా ప్రేమించుకున్నారు. అయిన వాళ్లందరినీ వదిలి రెండు నెలల క్రితమే పెళ్లాడారు. పెళ్లైన రెండ్రోజులకే ఆమెకు అత్తింటి ఆరళ్లు మొదలయ్యాయి. వేధింపులు భరిస్తూ బతకలేక.. ఆత్మహత్య చేసుకుంది. చిన్నకోడూరు మండలం మేడిపల్లికి చెందిన ఉమ్మెంతల మాధవి (28) సిద్దిపేట అర్బన్ మండలానికి చెందిన కట్కూరి శ్రీనివాస్ పదేళ్లుగా ప్రేమించుకున్నారు. ఈ ఏడాది మే 12న కూడవెళ్లి రామలింగేశ్వర దేవాలయంలో పెళ్లి చేసుకున్నారు. భూంపల్లి పోలీసుస్టేషన్కు వెళ్లి రక్షణ కల్పించాలని కోరారు. పోలీసులు ఇరు కుటుంబాలతో మాట్లాడి ఒప్పించారు. మాధవిని శ్రీనివాస్ కుటుంబసభ్యులు రెండ్రోజులు బాగానే చూసుకున్నారు. మూడో రోజు నుంచి ‘నువ్వు నాకు నచ్చలేదు వెళ్లిపో’ అంటూ భర్త వేధించడం మొదలుపెట్టాడు. గ్రూప్–2 కోచింగ్ తీసుకోవాలని శ్రీనివాస్ ఆమెను హైదరాబాద్ తీసుకెళ్లాడు. చిత్రహింసలు పెట్టాడు.
పోలీసులకు లేఖ రాసి..
తనను భర్త, అత్తమామలు, ఆడపడుచులు పెడుతున్న చిత్రహింసలపై దుబ్బాక సీఐకు తెలుపుతూ 4 పేజీల లేఖ రాసిన మాధవి.. ఎందుకో దాన్ని పోలీసులకు అందించలేదు. అనంతరం ఈ నెల 15న సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో పురుగుల మందు తాగింది. స్థానికులు గమనించి, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూసింది. కాగా, మాధవికి ఎనిమిదేళ్ల క్రితం మరొకరితో వివాహమైంది. పెళ్లయిన ఆరు నెలలకే విడాకులు తీసుకుంది. ఇదంతా తెలిసి శ్రీనివాస్ ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని పోలీసులు చెప్పారు. మాధవి బ్యాగులో ఆమె రాసిన లేఖ లభించింది. అది చదివిన ఆమె బంధువులు శ్రీనివాస్, అతని కుటుంబీకులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట రోడ్డుపై బైఠాయించారు.