ప్రియుడు మోసగించాడని యువతి ధర్నా

ప్రియుడు మోసగించాడని యువతి ధర్నా - Sakshi


నేలకొండపల్లి: ప్రేమిస్తున్నానని నమ్మించి, పెళ్లి చేసుకుంటానని వెంట తిరిగి, కాదు పొమ్మనడంతో తట్టుకోలేని ఆ యువతి తన ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది. ఆమె తెలిపిన ప్రకారం...నేలకొండపల్లి మండలం మోటాపురం గ్రామానికి చెందిన జి.వసంత, రాజేశ్వరపురంలోని దేవాలయంలో దైవ దర్శనం కోసం వస్తున్న క్రమంలో అదే దేవాలయంలో పూజారిగా పని చేస్తున్న పురాణం శివ మధ్య పరిచయం ఏర్పడింది. ఇది ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానంటూ ఆమెను అతడు నమ్మించాడు. నాలుగేళ్లపాటు కలిసి తిరిగారు. తీరా పెళ్లి చేసుకోవాలని ఆమె నిలదీయడంతో తప్పించుకుని తిరుగుతున్నాడు.



చివరకు ఫోన్ నంబర్ కూడా మార్చి, ఆమెను వదిలించుకునేందుకు గ్రామం విడిచి వెళ్లాడు. దీంతో తాను మోసపోయానని తెలుసుకుని మంగళవారం అతడి ఇంటి ముందు ధర్నాకు దిగింది. తనను పెళ్లి చేసుకునేంత వరకు ఇక్కడి నుంచి వెళ్లేది లేదంటూ భీష్మించింది. ఆమెను పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లారు. శివ గతంలో రాజేశ్వరపురం గ్రామానికి చెందిన ఓ యువతిని కూడా ఇదే విధంగా నమ్మించి మోసగించినట్టుగా కేసు నమోదైంది. తనకు న్యాయం జరిగేంత వరకు ఆందోళన కొనసాగిస్తానని వసంత చెప్పింది..

 

 దేహశుద్ధి


 శివకు వసంత కుటుంబీకులు, బంధువులు దేహశుద్ధి చేశారు. మంగళవారం ఓ పార్టీ కార్యాలయంలో పంచారుుతీకి వచ్చిన అతడు.. వసంతను దూషించాడు. దీంతో వారు తీవ్ర ఆగ్రహావేశంతో అతనిని పట్టుకుని కొట్టారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top