మరొకరితో నిశ్చితార్ధం.. ప్రియుడితో యువతి బలవన్మరణం
తూప్రాన్(మెదక్): మరో నెలలో పెళ్లి జరగాల్సిన ఆ ఇంటిలో విషాదం ఆలుముకుంది. మంచి చదువులు చదివించి ఓ ఇంటిదాన్ని చేద్దామనుకున్న ఆ తల్లిదండ్రుల ఆశలు అడియాశలయ్యాయి. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం పడాల్పల్లి గ్రామానికి చెందిన శినంగారం రాజు యాదవ్, లలిత దంపతుల కుమార్తె మౌనిక(20) తూప్రాన్లోని చైతన్య డిగ్రీ కళాశాలలో డిగ్రీ ఫైనలియర్ చదువుతోంది. ప్రస్తుతం పరీక్షలు రాస్తోంది. అయితే, మౌనిక అదే గ్రామానికి చెందిన బత్తుల లింగాయ్యయాదవ్ కుమారుడు నగేష్(24)తో ఆమె ప్రేమలో పడింది. అతడు రంగారెడ్డి జిల్లా మేడ్చల్లోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనలియర్ చదువుతున్నాడు.
వీరి ప్రేమ విషయం ఇరు కుటుంబాల్లో వారికి తెలియదు. అయితే మౌనికకు రంగారెడ్డి జిల్లా బోయిన్పల్లికి చెందిన యువకునితో ఇటీవల నిశ్చితార్థం అయింది. మే నెల 1వ తేదీన పెళ్లి జరగాల్సి ఉంది. దీంతో కుటుంబ సభ్యులు పెళ్లి పనుల్లో నిమగ్నమై ఉన్నారు. అయితే, ఈ సమయంలో తమ ప్రేమ సంగతి చెబితే రెండు కుటుంబాల్లో గొడవలు జరుగుతాయని భయపడిన నగేష్, మౌనిక గ్రామ సమీపంలోని రైలు పట్టాలపైకి బుధవారం ఉదయం వెళ్లి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు.