భర్త సినిమాకు తీసుకెళ్లలేదని... భార్య ఆత్మహత్య

భర్త సినిమాకు తీసుకెళ్లలేదని... భార్య ఆత్మహత్య


బంజారాహిల్స్(హైదరాబాద్): పెళ్లికి ముందు సినిమాలకు, షికార్లకు తిప్పేవాడు.. అడిగిందల్లా కొనిచ్చేవాడు.. తీరా పెళ్లయిన తర్వాత..? సినిమాలు, షికార్లు లేవు.. ఏదైనా అడిగితే చీదరించుకోవడం... పీకలదాకా మద్యం తాగి వచ్చి కొట్టడం.. మొదలు పెట్టాడు. భర్త తీరుతో జీవితంపై విరక్తి చెందిన ఆ ఇల్లాలు ఆత్మహత్యకు పాల్పడింది. ప్రకాశం జిల్లాకు చెందిన పి. సుమలత(27) యూసుఫ్‌గూడ శ్రీకృష్ణానగర్‌లో నివసించే సంతోష్‌కుమార్‌ను అయిదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకుంది. వారికి ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. కాగా, ఆ దంపతుల మధ్య కలతలు తలెత్తి, అంతరం పెరిగిపోయింది.



ఈ నేపథ్యంలోనే ఈ నెల 1వ తేదీన సినిమాకు వెళ్దామని సుమలత భర్తను అడిగింది. తనకు తీరిక లేదని అతడు చెప్పడంతో.. రెండేళ్లుగా ఇదేమాట చెబుతున్నావంటూ వాగ్వాదానికి దిగింది. ఆగ్రహంతో తన గదిలోకి వెళ్లి నిద్రమాత్రలు మింగింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిన సుమలతను సంతోష్ సోమాజిగూడలోని ఓ ఆస్పత్రిలో చేర్పించి చేతులు దులుపుకున్నాడు. రెండు రోజులు గడిచినా అతడు రాకపోయేసరికి వైద్యులు బాధితురాలి సోదరుడు వినోద్‌కుమార్‌కు సమాచారం ఇచ్చాడు. ఈ నెల 2న వినోద్ ఆస్పత్రికి వచ్చి సోదరి పరిస్థితిని చూసి వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి ఆమె ఆదివారం ఉదయం కన్నుమూసింది. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top