వరకట్న వేధింపులకు ఇల్లాలు బలి
తాడ్వాయి (నిజామాబాద్) : వరకట్న వేధింపులతో ఆత్మహత్యాయత్నం చేసిన మహిళ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే... నిజామాబాద్ జిల్లా తాడ్వాయి మండలం దెమికలాన్ గ్రామానికి చెందిన సమీనా బేగం(30)ను భర్త, అత్త మామలు అదనపు కట్నం కోసం వేధిస్తుండడంతో గత నెల 25న ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది.
తీవ్ర గాయాలపాలైన ఆమెను సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్న సమీనా బేగం పరిస్థితి విషమించడంతో శనివారం మృతి చెందింది. దీనిపై తాడ్వాయి పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు.