అవినీతి సహించను: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘అవినీతి రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుదాం. అవినీతికి వ్యతిరేకంగా ఉన్నామని కేంద్రంలో మనకు మంచి పేరు ఉంది. కొందరు ఈ పేరును నాశనం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అవినీతిని సహించను. ఎంతటి వారైనా, ఏ స్థాయి వారైనా వదిలేది లేదు. ఈ సందేశాన్ని కింది స్థాయి వరకు తీసుకెళ్లాలి..’ అని తెలంగాణ సీఎం కేసీఆర్ తన మంత్రి వర్గ సహ చరులకు స్పష్టం చేశారు. అవినీతి ఆరోపణల వల్ల డిప్యూటీ సీఎం రాజయ్యను బర్తరఫ్ చేయడం, ఆయన స్థానంలో వరంగల్ ఎంపీ కడియం శ్రీహరిని తీసుకోవడం వంటి పరిణామాల నేపథ్యంలో సీఎం తన మంత్రివర్గ సహచరులతో ఆదివారం సాయంత్రం క్యాంపు ఆఫీసులో భేటీ అయ్యారు.
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు దాదాపు పది నిమిషాల సేపు సీఎం ఒక విధంగా మంత్రులందరికీ క్లాస్ తీసుకున్నారు. ‘జాగ్రత్తగా పనిచేయండి. సొంత ఎజెండాలు వద్దు..’ అని సీఎం వ్యాఖ్యానించినట్లు సమాచారం. కొందరిపై కబ్జా ఆరోపణలు వస్తున్నాయని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించినట్లు తెలిసింది. డిప్యూటీ సీఎం రాజయ్య తొలగింపుపై వచ్చే విమర్శలను ధైర్యంగా తిప్పికొట్టాలని, అవినీతికి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం ఎంత నిక్కచ్చిగా వ్యవహరిస్తుందో తెలియజెప్పాలని సీఎం మంత్రులందరికీ సూచించినట్లు సమాచారం.