భార్యను చంపి ఉరేసుకున్న భర్త

భార్యను చంపి ఉరేసుకున్న భర్త - Sakshi


అనుమానమే పెనుభూతమై...

వర్ని: నిజామాబాద్ జిల్లా వర్ని మండలం చందూర్ గ్రామంలో ఓ వ్యక్తి భార్యను గొడ్డలితో హతమార్చి, తాను కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. స్థానికులు,ఎస్‌ఐ అంజయ్య తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చందూర్ గ్రామానికి చెందిన గుండ్ల లక్ష్మణ్ (32)కు నిజామాబాద్ మండలం సిరిపురానికి చెందిన రోజా అలియాస్ స్వప్నతో పదేళ్ల క్రితం వివాహం జరిగింది.



వీరికి ఇద్దరు కుమారులు నిఖిల్ (7), అఖిల్ (5) ఉన్నారు. లక్ష్మణ్ జీవనోపాధి కోసం రెండేళ్లపాటు దుబాయ్ వెళ్లి ఏడాది క్రితం తిరిగి వచ్చాడు. అప్పటి నుంచి భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్నాడు. సోమవారం రాత్రి లక్ష్మణ్ ఇంటికి వచ్చేసరికి భార్య ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడుతూ కనిపించింది. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. లక్ష్మణ్ తల్లి లింగవ్వ, కొందరు స్థానికులు వారిద్దరిని సముదాయించారు. అనంతరం, పిల్లలతో కల్సి పడుకున్న ఇద్దరు తెల్లారేసరికి విగతజీవులయ్యారు.



మంగళవారం ఉదయం పెద్ద కుమారుడు నిఖిల్ నిద్రలేచి, రక్తం మడుగులో పడి ఉన్న తల్లిని, ఉరి వేసుకున్న తండ్రిని చూసి, పరుగెత్తుకుపోయి పక్కింట్లో ఇంట్లో ఉన్న నాన్నమ్మ లింగవ్వకు చెప్పాడు. లింగమ్మ కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు వచ్చి పోలీస్‌స్టేషన్‌కు సమాచారమందించారు. రోజాను లక్ష్మణ్ గొడ్డలితో తలపై నరికి కిరాతకంగా హత్య చేశాడు. గతంలోనూ ఇరువురి మధ్య ఇదే విషయమై ఘర్షణలు జరగగా, కుల పెద్దలు పంచాయతీ నిర్వహించినట్లు సమాచారం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top