ఆ ఏడు మండలాలకు ఎంపీ ఎవరు?
న్యూఢిల్లీ: తన నియోజకవర్గ పరిధిలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్లో విలీనం చేశారని, అయితే ఆయా మండలాల్లోని 60 వేల మంది ప్రజలకు ఇప్పుడు ఎంపీ ఎవరని మహబూబాబాద్ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్ ఆవేదన వ్యక్తంచేశారు. గురువారం లోక్సభలో జీరోఅవర్లో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు.
" ఇది ఆదివాసీ ప్రజల సమస్య. ఏడు మండలాల్లో దాదాపు 60 వేల మంది ఓటర్లయిన ఆదివాసీలను ఆంధ్రప్రదేశ్లో కలిపారు. ఈ 60 వేల మంది ఆదివాసీ ఓటర్లు నన్ను ఎంపీగా గెలిపారు. ఇప్పుడు ఈ 60 వేల మంది ఓటర్లకు ఎంపీ ఎవరు? ఎమ్మెల్యే ఎవరు? వారు వారి సమస్యలపై ఎవరిని అడుగుతారు? వారు చాలా దురవస్థలో ఉన్నారు. నేను పార్లమెంటుకు ఎన్నికైనప్పటి నుంచి అడుగుతూనే ఉన్నాను. అలాగే ఇక్కడ ముంపు ప్రాంతంలో లేని నాలుగు పంచాయతీలను కూడా విలీనం చేశారు. అందువల్ల ఆయా అంశాలపై కేంద్రం దృష్టిపెట్టి వారికి న్యాయం చేయాలి". అని సీతారాం నాయక్ కోరారు.