సమస్యలు పరిష్కరించకుంటే..

సమస్యలు పరిష్కరించకుంటే..

► ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ 

 

జెడ్పీసెంటర్‌: లారీ యాజమాన్యాల డిమాండ్లను పరిష్కరించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ హెచ్చరించారు. గురువారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ సింగిల్‌ పర్మిట్‌ విధానం లేకపోవడం వల్ల లారీ యజమాన్యం తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. లారీలు నడిచే ఆయా రాష్ట్రాల్లో పన్నులు చెల్లించాల్సి వస్తుందని చెప్పారు. సింగిల్‌ పర్మింట్‌ విదానాన్ని అమలుచేయాలని కోరారు. ప్రైవేట్‌ బీమా సంస్థల ఒత్తిడి మేరకు థర్డ్‌పార్టీ బీమాను ఏప్రిల్‌ నుంచి 50 శాతం పెంపు ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. దేశవ్యాప్తంగా డీజిల్, పెట్రోల్, గ్యాస్‌ ధరలు ఏకీకృతంగా ఉండేలా చూడాలని కోరారు.



15ఏళ్లు నిండిన లారీల పర్మిట్ల రద్దుపై పునరాలోచించాలని కోరారు. తెలుగు రాష్ట్రల్లో అమలయ్యేలా సింగిల్‌ పర్మిట్‌కు అవకాశం కల్పించాలని కోరారు. ఉమ్మడి రాష్ట్రానికి చెల్లుబాటయ్యేలా చెల్లించిన క్వార్టర్లీ ట్యాక్స్‌ను తగ్గించి తెలంగాణ పరిధికి అనుగుణంగా కొత్త పన్ను విధానాన్ని అమలు చేయాలన్నారు. అనంతరం సమ్మె పోస్టర్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు శివకుమార్, లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు బేగ్, ఆర్‌టీఏ మెంబర్‌ జావిద్‌బేగ్‌ తదితరులు పాల్గొన్నారు.  

 
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top