18(ఎఫ్) తొలగింపునకు మళ్లీ ఉద్యమిస్తాం
సచివాలయ నాన్ గెజిటెడ్ టీ ఉద్యోగుల సంఘం
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల విభజనలో కమలనాథన్ కమిటీ మార్గదర్శకాల్లోని 18(ఎఫ్) నిబంధన తొలగించకుంటే గతంలో 14 (ఎఫ్) తొలగింపునకు పోరాడినట్లే మళ్లీ ఉద్యమిస్తామని సచివాలయ నాన్ గెజిటెడ్ తెలంగాణ ఉద్యోగుల సంఘం హెచ్చరించింది. సోమవారం సంఘం సభ్యులు సచివాలయంలో కమలనాథన్ను కలసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఉద్యోగుల విభజనకు సంబంధించి కమలనాథన్ కమిటీ మార్గదర్శకాలు తెలంగాణ ఉద్యోగులకు వ్యతిరేకంగా ఉన్నాయని సంఘం అధ్యక్షుడు శ్రావణ్కుమార్రెడ్డి ఆరోపించారు. ఎస్సీ/ఎస్టీలకు ఆప్షన్లు ఇచ్చారని, ఆంధ్రప్రదేశ్ నుంచి ఆ ఉద్యోగులు ఇక్కడకు వస్తే తెలంగాణలోని ఎస్సీ/ఎస్టీల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. దంపతులు ఇద్దరు ఉద్యోగులు అయితే వారు ఎక్కడ కోరితే అక్కడకు పంపించే నిర్ణయంపై కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇద్దరు ఆంధ్రకు చెందిన ఉద్యోగులైతే ఆప్షన్స్ వర్తింప చేయకుండా వారిని ఆంధ్రప్రదేశ్కు పంపించాలని డిమాండ్ చేశారు. సచివాలయ మహిళా ఉద్యోగుల సంఘం అధ్యక్షురాలు సుభద్ర మాట్లాడుతూ... ఈ మార్గదర్శకాలు తమకు ఆమోదయోగ్యం కావని స్పష్టం చేశారు. దీనిపై కమలనాథన్ కమిటీకి వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు.