ప్రజల కోసమే ఆర్టీసీ, పోలీసులు
హన్మకొండ సిటీ : ప్రజల కోసమే ఆర్టీసీ, పోలీసులు ఉన్నారని అర్బన్ ఎస్పీ ఎ.వెంకటేశ్వర్రావు అన్నారు. వరంగల్లోని ఆర్టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కళాశాలలో మంగళవారం ప్యాసింజర్ గైడ్స్, ఆర్టీసీ హోంగార్డులకు ఒకరోజు అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్రావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ రెండు శాఖల అధికారులు, సిబ్బంది ప్రజలకు నిత్యం సేవలందిస్తున్నారని తెలిపారు. రెండు శాఖలు సమన్వయంతో పనిచేసి మేడారం జాతరను విజయవంతం చేశాయని గుర్తు చేశారు. మరింత సమన్వయంతో పనిచేసి ప్రజల అభిమానాన్ని చూర గొందామని సూచించారు.
సమయపాలన పాటిస్తూ మెరుగైన సేవలందించి సంస్థపై నమ్మకం, విశ్వాసం కలిగించాలని సూచించారు. ఆర్టీసీ ఆర్ఎం యాదగిరి మాట్లాడుతూ ప్యాసింజర్ గైడ్స్, హోంగార్డులు విధులను సక్రమంగా నిర్వర్తిస్తూ ప్రయాణికులకు సహాయకారిగా ఉండాలన్నారు. స్టేజీల వద్ద ప్రయాణికులకు అందుబాటులో ఉంటూ బస్సుల వివరాలు తెలియజేయూలని సూచించారు. అనంతరం ఎస్పీ వెంకటేశ్వర్రావు ట్రైనింగ్ కాలేజీ ఆవరణలో మొక్కలు నాటారు. సదస్సులో ఆర్టీసీ డిప్యూటీ సీఎంఈ ఎ.శ్రీధర్, డిప్యూటీ సీటీఎం భవానీప్రసాద్, ప్రిన్సిపాల్ భాస్కర్రావు, బీఎం వై.అబ్రహం పాల్గొన్నారు.