రైతులను అన్నివిధాల ఆదుకుంటాం

రైతులను అన్నివిధాల ఆదుకుంటాం - Sakshi


రామాయంపేట: రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని డిప్యూటీ స్పీకర్, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి , మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి హామీ ఇచ్చారు. గురువారం రామాయంపేట వచ్చిన సందర్భంగా స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో వారు విలేకరులతో మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా రెండో గ్రేడ్, మూడో గ్రేడ్ మక్కలను కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.  



దీంతో రైతులకు కొంతమేర మేలు జరుగుతుందన్నారు. కరువు మూలంగా మొక్కజొన్న  సరిగా ఎదగక పోవడంతో చాలావరకు రైతులు నష్టపోయారని, గ్రేడ్లవారీగా  మక్కలను కొనుగోలు చేయడంతో వారికి న్యాయం జరుగుతుందన్నారు. ప్రతిపక్షాలు రైతులను మభ్యపెడుతున్నాయని, ఇకనైనా తమ వైఖరి మార్చుకోవాలని సూచించారు. అనవసర విమర్శలు చేయకుండా అభివృద్ధి విషయమై సహకరించాలన్నారు. విలేకరులకు హెల్త్‌కార్డులతోపాటు ఇళ్ల స్థలా లు మంజూరు చేస్తామన్నారు.



ఈసందర్భంగా ఎంపీపీ అధ్యక్షురాలు పుట్టి విజయలక్ష్మి, మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు మానెగల్ల రామకిష్టయ్య డిప్యూటీ స్పీకర్, ఎంపీ కొత్తప్రభాకర్‌రెడ్డిని సన్మానించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర నాయకుడు, నరేన్ ట్రస్ట్ అధినేత చాగన్ల నరేంద్రనాధ్, ఎంపీపీ ఉపాధ్యక్షుడు జితేందర్‌గౌడ్, జెడ్పీటీసీ సభ్యురాలు విజయలక్ష్మి, టీఆర్‌ఎస్ మండలశాఖ అధ్యక్షుడు రమేశ్‌రెడ్డి, పట్టణశాఖ అధ్యక్షుడు పుట్టి యాదగిరి, సర్పంచులు పాతూరి ప్రభావతి, తిర్మల్‌గౌడ్, పార్టీ జిల్లాశాఖ ప్రధాన కార్యదర్శి కొండల్‌రెడ్డి, మాజీ ఎంపీపీ సంపత్, చంద్రపు కొండల్‌రెడ్డి, రామారావు, తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top