మెదక్ అభ్యర్థిపై కాంగ్రెస్ కసరత్తు


సునీతాలక్ష్మారెడ్డి లేదా జగ్గారెడ్డి వైపు జిల్లానేతల మొగ్గు?

 

 హైదరాబాద్ : మెదక్ లోక్‌సభ స్థానానికి సెప్టెంబర్‌లో జరగనున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ పక్షాన అభ్యర్థిగా ఎవరిని బరిలో దింపాలనే అంశంపై టీపీసీసీ కసరత్తు చేస్తోంది. బుధవారం హైదరాబాద్‌లోని ఒక హోటల్‌లో సమావేశమైన నేతలు ఈ అంశంపై ప్రాథమికంగా చర్చించారు. జిల్లాకు చెందిన వారికే లోక్‌సభ అభ్యర్థిగా పోటీచేసే అవకాశాన్ని కల్పించాలని మెదక్‌జిల్లా నేతలు గట్టిగా పట్టుబడుతున్నారు.



మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి, ప్రభుత్వ మాజీ విప్ జగ్గారెడ్డిలలో ఎవరో ఒకరికి టికెట్ ఇవ్వాలని  జిల్లా నేతలు కోరుతున్నట్లు విశ్వసనీయ సమాచారం, ఈ భేటీలో టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, వర్కింగ్‌ప్రెసిడెంట్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహ, మాజీ మంత్రులు జె.గీతారెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి, ప్రభుత్వ మాజీ విప్ జగ్గారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, ఎమ్మెల్సీ ఫారుఖ్‌హుస్సేన్, మాజీ ఎంపీ సురేష్‌షెట్కార్, శశిధర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. తనకు ఎంపీగా పోటీ చేసే అవకాశాన్ని కల్పించాలంటూ సర్వే సత్యనారాయణ, ఫారూక్ హుస్సేన్, శ్రావణ్‌కుమార్ తదితరులు కోరుతున్నారు. ఈ నెల 23న  రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ హైదరాబాద్ నగరానికి విచ్చేస్తున్న సందర్భంగా పార్టీ అభ్యర్థిని ఖరారు చేయనున్నారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top