'పవన్ కల్యాణ్ ఇంటి ముందు బైఠాయిస్తా'
హైదరాబాద్: ‘అవినీతిని రూపుమాపుతా...నిలదీస్తా’ అంటూ గత ఎన్నికల సమయంలో ప్రగల్భాలు పలికిన సినీనటుడు పవన్ కల్యాణ్ ‘ఓటుకు కోట్లు’ అంశంపై ఎందుకు స్పందించడం లేదని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు ప్రశ్నించారు. ఎన్నికల ముందు పార్టీ పెట్టి కనిపించకుండా పోయిన ఆయన..చంద్రబాబు, రేవంత్రెడ్డిల బండారం బట్టబయలైనా ఎందుకు మాట్లాడడం లేదన్నారు.
ఈ విషయంపై అడిగేందుకు తాను రెండు మూడు రోజుల్లో పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్తానని వీహెచ్ పేర్కొన్నారు. తగిన సమాధానం రాకుంటే ఆయన ఇంటి ముందు బైఠాయిస్తానని హెచ్చరించారు. సోమవారం రాజేంద్రనగర్ సర్కిల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోలన్ సుభాష్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో హనుమంతరావు పాల్గొన్నారు.