అధిష్టానం చూసుకుంటుంది
- ‘కోమటిరెడ్డి బ్రదర్స్’ వ్యాఖ్యలపై ఉత్తమ్
- ఉద్యోగాల కల్పనలో సర్కార్ విఫలం
శంషాబాద్ (రాజేంద్రనగర్): ‘కోమటిరెడ్డి బ్రదర్స్’ వ్యవహారాన్ని అధిష్టానం చూసుకుంటుందని పీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో విలేక రులతో ఆయన మాట్లాడారు. కోమటిరెడ్డి సోదరులు ఇటీవల హైకమాండ్పై చేసిన వ్యాఖ్యల గురించి విలేకరులు ప్రశ్నించగా ఆయన పైవిధంగా స్పందించారు. ఈ వ్యవహారం ఏఐసీసీ పరిశీలనలో ఉందని, ఈ విషయమై ఇంతకంటే తానేమీ మాట్లాడలేనని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ హయాంలో అభివృద్ధిలో ప్రపంచస్థాయి గుర్తింపు సాధించిన రంగారెడ్డి జిల్లా.. టీఆర్ఎస్ పాలనలో తిరోగమనంలోకి వెళ్లిందని విమర్శించారు.
యూపీఏ ప్రభుత్వ హయాంలో మంజూరైన ఐటీఐఆర్ ప్రాజెక్టు అడ్రస్ లేకుండా పోయిందని అన్నారు. ఐటీఐఆర్ ప్రాజెక్టుతో రంగారెడ్డి సిలికాన్ వ్యాలీలా మారేదన్నారు. టీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ ఉద్యోగాలు లేవు, ప్రైవేటు ఉద్యోగాలు కల్పించే ప్రాజెక్టులు కూడా లేకుండా పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీతో సన్నిహితంగా ఉంటున్న సీఎం.. రాష్ట్రానికి ప్రాజెక్టు సాధించే విషయంలో ఏ మాత్రం శ్రద్ధ చూపడం లేదన్నారు.
ఉద్యోగాలు కల్పించే విషయంలో రాష్ట్ర సర్కారు పూర్తిగా విఫలమైందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం నిండా అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. మియాపూర్ భూ కుంభకోణంలో కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ను కలసి సీబీఐ దర్యాప్తు వేయాల్సిందిగా కోరడానికి తాము ప్రయత్నించామన్నారు. కబ్జాదారుల నుంచి భూములు కోల్పోయిన రైతులకు ఎప్పుడూ అండగా ఉంటామన్నారు.