నేటినుంచి సంగారెడ్డిలో యూటీఎఫ్ మహాసభలు
సంగారెడ్డి మున్సిపాలిటీ : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత యూటీఎఫ్ ప్రథమ మహాసభలను నిర్వహించేందుకు నిర్వహకులు ముమ్మర ఏర్పాట్లను చేస్తున్నారు. మహాసభలకు సంగారెడ్డిలోని ఐటీఐ ప్రాంగణం వేదికైంది. ఈ నెల 20, 23 తేదీ వరకు మూడు రోజుల పాటు జరిగే ఈ మహాసభలకు ముఖ్య అతిథిలుగా రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్రావు, విద్యాశాఖ మంత్రి జగదీష్రెడ్డిలు హాజరుకానున్నారు. ఈ ప్రాంగణానికి తెలంగాణ కోసం ఆత్మత్యాగం చేసుకున్న ఉపాధ్యాయుడు చంద్రమౌళి పేరు పెట్టారు.
ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహాసభలకు రాష్ట్రంలోని 10 జిల్లాల నుంచి సుమారు 8 వేల మంది ఉపాధ్యాయులు హాజరుకానున్నారు. వీరితో పాటు వెయ్యి మంది ప్రతినిధులు మూడు రోజుల పాటు నిర్వహించే సభల్లో పాల్గొంటారు. వీరందరికీ పట్టణంలోని పది ప్రైవేట్ పాఠశాలలో బసను ఏర్పాటు చేశారు. మొదటి రోజు ఉదయం 10 గంటలకు యూనియన్ పతాకావిష్కరణ, 10.30కి ఐబీ నుంచి ఐటీఐ వరకు భారీ ఉపాధ్యాయ ప్రదర్శన, అనంతరం 12 గంటలకు ప్రారంభ సభ నిర్వహించడం జరుగనుంది.
21న ఉదయం 9 గంటలకు ప్రతినిధుల సభలో ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నర్సిరెడ్డి ప్రసంగం, యూనియన్ చేపట్టిన కార్యక్రమ నివేదిక, 22న ప్రతినిధుల సభలో నివే దికలపై చర్చించి తీర్మానాలపై చర్చ, అనంతరం నూతన రాష్ట్ర కమిటీని ఎన్నుకోవడం జరుగనుంది.