తెలంగాణ వాటర్‌గ్రిడ్‌కు కేంద్రం అభినందన

తెలంగాణ వాటర్‌గ్రిడ్‌కు కేంద్రం అభినందన


ప్రాజెక్టును అధ్యయనం చేయాలని అన్ని రాష్ట్రాలకు నోట్



సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన వాటర్‌గ్రిడ్ ప్రాజెక్ట్ నమూనాను కేంద్ర ప్రభుత్వం అభినందించింది. రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ద్వారా మంచినీరందించే ఉద్దేశంతో చేపట్టిన ఈ ప్రాజెక్టును అధ్యయనం చేయాలని దేశంలోని అన్ని రాష్ట్రాలకు కేంద్రం నోట్ పంపింది.



నోట్‌లో ‘తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంచినీటి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది. బడ్జెట్లో కూడా రూ. 2వేల కోట్లు కేటాయించింది. వివిధ ఆర్థిక సంస్థల నుంచి సాయం కూడా పొందుతోంది. ఈ ప్రయత్నాలు అభినందనీయం. ఈ వాటర్‌గ్రిడ్ నమూనా ఆచరణాత్మకంగా ఉన్నందున, మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఈ పథకం అమలు చేసే అంశాన్ని ప్రభుత్వాలు పరిశీలించాలి’ అని పేర్కొంది.



ఇటీవల ఢిల్లీలో జరిగిన జాతీయ గ్రామీణ  మంచినీటి వార్షిక ప్రణాళిక సమావేశంలో వాటర్‌గ్రిడ్ పథకంపై చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో.. కేంద్రం ఈ నోట్‌ను రూపొందించి అన్ని రాష్ట్రాలకూ పంపింది. గ్రామీణ నీటిసరఫరా విభాగం అధికారులు ఎంతో శ్రమించి ఈ ప్రాజెక్టును రూపొందించారని, ఈ నమూనా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవడం అభినందనీయమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top