అనుమానాస్పద స్థితిలో ఇద్దరు యువతుల మృతి
ఖానాపూర్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం మస్కాపూర్ గ్రామ శివారులోని ఊరకుంటలో ఆదివారం ఇద్దరు యువతుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఖానాపూర్ మండల కేంద్రంలోని ఇంద్రానగర్ కాలనీకి చెందిన తొంటుకూరి హరీశ(22), కడెం మండలం ఎల్లగడప గ్రామానికి చెందిన కొండవేని హరిత(23) స్నేహితులు. హరిత ఎల్లగడప నుంచి వచ్చి ఖానాపూర్ మండల కేంద్రంలోని ఇంద్రానగర్లోని వారి అమ్మమ్మ ఇంట్లో నివసిస్తోంది. ఈ ఇద్దరు యువతులు ప్రైవేటు పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్నారు.
శనివారం నుంచి వీరిద్దరు కనిపించకపోవడంతో బంధువులు, సమీపంలోని వారిని ఆరా తీశారు. ఆదివారం వారు ఊరకుంటలో మృతదేహాలుగా కనిపించారు. అయితే తమ బిడ్డలు ఆత్మహత్య చేసుకొనే అంత పిరికివారు కాదని, ఇది ముమ్మూటికీ హత్యేనని కుటుంబీకులు ఆరోపించారు. కాగా, ఘటన స్థలంలో కత్తి దొరకడం పలు అనుమానాలకు తావిస్తోంది. యువతులు కుంటలో దూకి ఆత్మహత్య చేసుకున్నారా..? ఎవరైనా హత్య చేసి చెరువులో పడేశారా? అనే విషయంపై పోలీసులు విచారణ చేస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.