అమ్మ తిట్టిందని ఒకరు.. ఆలి అలిగిందని మరొకరు !
హైదరాబాద్: చిన్న చిన్న సంఘటనలకే ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. చెప్పకుండా ఇంట్లో నుంచి ఎందుకు బయటకు వెళ్లాలని తల్లి తిట్టడంతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య అలిగి పుట్టింటికి వెళ్లిందని మరో వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాలివి.. రంగారెడ్డి జిల్లా ఫరుక్నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామానికి చెందిన యాదగిరి(20) అనే యువకుడు మంగళవారం వినాయకుడి విగ్రహం తేవడానికి ఇంట్లో చెప్పకుండా హైదరాబాద్ వెళ్లాడు.
అర్థరాత్రి సమయంలో ఇంటికి రావడంతో తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన యాదగిరి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇదిలా ఉండగా.. జనగామ జిల్లా కేంద్రంలో కురుమవాడలో భార్య కాపురానికి రావడం లేదనే కోపంతో మైల శేఖర్(33) ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రెండు ఘటనల్లో కేసులు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.