సాయం చేయడానికి పోయి..!
మోతె: స్నేహమే జీవితం.. స్నేహమే శాశ్వతం అనుకున్న ఈ యువకులు మిత్రుడికి సాయం చేయడానికి పోయి మృత్యు ఒడికి చేరారు. ఈ సంఘటన జిల్లాలోని మోతె మండలం రాఘవపురంలో శనివారం చోటుచేసుకుంది. స్నేహితుడికి సాయం చేయడానికి వచ్చి ఇద్దరు యువకులు కరెంట్ షాక్కు గురై మృతి చెందారు. మరో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు.
గ్రామానికి చెందిన వీరబోయిన మహేశ్(18) పొలం పని చేస్తుండగా.. అతనికి సాయంగా మరో ముగ్గురు స్నేహితులు వచ్చారు. పొలం మధ్యలో ఉన్న సపోర్ట్ వైర్ను పక్కకు తొలగిస్తున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టడంతో మహేశ్, పెద్దింటి శ్రీకాంత్(23)లు అక్కడికక్కడే మృతి చెందారు. వారిని రక్షించడానికి వెళ్లిన మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.