కొత్త వెలుగులు!

కొత్త వెలుగులు!


ఖమ్మం జిల్లాలో రెండు మెగా విద్యుత్ ప్లాంట్లు

 

 సాక్షి, హైదరాబాద్:రాష్ర్టంలో విద్యుత్ కొరతను తీర్చేందుకు ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. కరెంటు కోతలపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా ఉత్పత్తిని పెం చేందుకు ప్రయత్నిస్తోంది. వచ్చే రెండు మూడేళ్లలోనే మిగులు విద్యుత్‌ను సాధించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే విద్యుత్ సంస్థలను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం కొత్త విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుపై ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించారు. దీంతో రాబోయే మూడేళ్లలో 6 వేల మెగావాట్ల విద్యుత్‌ను అదనంగా ఉత్పత్తి చేసేందుకు టీ-జెన్‌కో సమాయత్తమైంది. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లా ఇల్లెందు సమీపంలోని పెనుగడప వద్ద 4 వేల మెగావాట్ల భారీ విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి ముఖ్యమంత్రి తాజాగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.

 

 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఐదు యూనిట్లు ఇక్కడ ఏర్పాటు కానున్నాయి. అలాగే ఇదే జిల్లాలోని 1,080 మెగావాట్ల మరో విద్యుత్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని జెన్‌కోను కేసీఆర్ ఆదేశించారు. దీంతో 270 మెగావాట్ల చొప్పున సామర్థ్యం కలిగిన నాలుగు యూనిట్లను పాల్వంచ వద్ద నిర్మించేందుకు రంగం సిద్ధమైంది. ఈ విద్యుత్ కేంద్రాన్ని రెండేళ్లలో అందుబాటులోకి తీసుకురావాలని సీఎం నిర్దేశించారు. రాష్ర్టంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిని చక్కదిద్దడానికి పనులను వేగవంతం చేయాలని సూచించారు. మరోవైపు టీ-జెన్‌కో నిర్మించనున్న విద్యుత్ ప్లాంట్లతో పాటు ట్రాన్స్‌కో, డిస్కంలకు భారీగా రుణాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని గ్రామీణ విద్యుదీకరణ సంస్థ(ఆర్‌ఈసీ) ముందుకు వచ్చింది. జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావుతో కలిసి ఆర్‌ఈసీ సీఎండీ రాజీవ్ శర్మ మంగళవారం సచివాలయంలో సీఎంతో సమావేశమయ్యారు. జెన్‌కో నిర్మించనున్న అన్ని ప్లాంట్లకు ఆర్థిక సహాయం అందిస్తామని ఈ సందర్భంగా శర్మ హామీ ఇచ్చారు. అయితే ప్రస్తుతానికి రూ. 20 వేల కోట్ల మేర రుణాలు ఇవ్వాలని కేసీఆర్ కోరగా ఆయన సమ్మతించారు.

 

 భూ లభ్యతే కీలకం

 

 ప్రభుత్వ భూమి సిద్ధంగా ఉన్న చోట ప్లాంట్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయవచ్చునని టీ-జెన్‌కో భావిస్తోంది. ఇందుకనుగుణంగానే పెనుగడప వద్ద 8 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్లు గుర్తించింది. ఇందులో 5 వేల ఎకరాలను తమకు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరింది. జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు ఈ ప్రతిపాదనను సీఎం ముందుకు తేగా ఆయన సానుకూలంగా స్పందించారు. అలాగే పాల్వం చ వద్ద విద్యుత్ ప్లాంట్ నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలని కేసీఆర్ సూచించారు. ఈ కాంట్రాక్టును భారత్ హెవీ ఎలక్ట్రికల్స్‌కు ఇచ్చినట్లు ప్రభాకర్‌రావు తెలిపారు. ‘పాల్వంచ ప్లాంట్‌కు అవసరమైన బాయిలర్లు, టర్బైన్లు భెల్ వద్ద సిద్ధంగా ఉన్నాయి. అందువల్ల ప్లాంట్ల నిర్మాణం కేవలం రెండేళ్లలో పూర్తి చేస్తామని ఆ సంస్థ హామీనిచ్చింది. సీఎం కూడా ఆమోదించారు’ అని ప్రభాకర్‌రావు ‘సాక్షి’కి వివరించారు.

 

 

 సీఎం సమీక్ష

 

 ఏడాదిలోనే అదనంగా 2,800 మెగావాట్లు

 తెలంగాణలో విద్యుత్ డిమాండ్, సరఫరా పరిస్థితిని సీఎం కేసీఆర్ సమీక్షించారు. ఇటీవలి వర్షాలతో విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గిందని, ప్రస్తుతం డిమాండ్‌కు మించి విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలమని జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు తెలిపారు. రిజర్వాయర్లు నిండటంతో భారీగా జల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నట్లు కేసీఆర్‌కు వివరించారు. కొత్తగా నీటి పారుదల ప్రాజెక్టులు, పరిశ్రమలు, ఐటీఐఆర్ ప్రాజెక్టు, మంచినీటి గ్రిడ్ ఏర్పాటైతే డిమాండ్ భారీగా పెరుగుతుందని, అందుకు అనుగుణంగా కొత్త ప్లాంట్ల నిర్మాణాన్ని చేపట్టాలని సీఎం సూచించారు. ‘వచ్చే ఏడాదిలో 2,800 మెగావాట్ల విద్యుత్ అదనంగా అందుబాటులోకి వస్తుంది. వచ్చే ఆగస్టు నాటికి టీ-జెన్‌కోకు చెందిన 600 మెగావాట్ల కాకతీయ థర్మల్ ప్లాంటు, 2015 అక్టోబర్ నాటికి సింగరేణికి చెందిన 1,200 మెగావాట్ల ప్లాంట్లతో పాటు కేంద్ర విద్యుత్ ప్లాంట్ల నుంచి రాష్ట్రానికి మరో వెయ్యి మెగావాట్ల వాటా అదనంగా అందుబాటులోకి రానుంది. మొత్తం 2,800 మెగావాట్ల విద్యుత్ అదనంగా వినియోగంలోకి వస్తుంది’ అని ప్రభాకర్‌రావు వివరించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top