రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి దుర్మరణం

రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి దుర్మరణం - Sakshi


చౌటుప్పల్‌  : వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం చెందారు. యాదాద్రి జిల్లాలోని చౌటుప్పల్, భువనగిరి పట్టణాల్లో చోటు చేసుకున్న ఈ ఘటనల వివరాలు.. మండల కేంద్రానికి చెందిన బత్తుల క్రాంతికుమార్‌ (22) తన మిత్రుడికి చెందిన పల్సర్‌ బైక్‌ను తీసుకుని హైదరాబాద్‌కు వెళ్తున్నాడు. ఆ క్రమంలో లక్కారం గ్రామం వద్ద అండర్‌పాస్‌ బ్రిడ్జిపై ప్రమాదకరంగా, నిర్లక్ష్యంగా ఓ ట్రాలీ లారీ నిలిపి ఉంది. పక్క నుంచి భారీగా వస్తున్న వాహనాలను తప్పించుకునే  క్రమంలో ఆ పక్కనే  ఉన్న ట్రాలీ లారీని వెనుక నుంచి ఢీకొట్టి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతడిని  ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు.  పరిస్థితి విషమంగా ఉండడంతో అతడిని హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. మృతుడి తండ్రి సుదర్శన్‌ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ చిల్లా సాయిలు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి తల్లి గతేడాది మృతిచెందింది. ఒక్కగానొక్క కుమారుడు చనిపోవడంతో తండ్రి రోదన పలువురిని కంటతడిపెట్టించాయి.



బైక్‌ నుంచి కిందపడి మహిళ..

భువనగిరిఅర్బన్‌ : మండలంలోని గంగసానిపల్లి గ్రామానికి చెందిన రెడ్డబొయిన హేమలత(26) భువనగిరిలోని ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలోని ఓ బ్యాంగిల్స్‌ స్టోర్స్‌లో పనిచేస్తోంది. ఆమె ఉదయం వచ్చి సాయంత్రం 6.30కి తిరిగి ఇంటికి వెళ్లిపోతుంది. ఆదివారం షాపులో ఆలస్యం కావడంతో షాపు యాజమాని ఆమెను తన స్కూటిపై గ్రామానికి తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో రాత్రి 7.30 సమయంలో మండలంలోని రాయగిరి గ్రామపరిధిలోని మాసుకుంటలోకి రాగానే  బైకుపై నుంచి కిందపడిపోయింది. దీంతో ఆమె తలకు తీవ్ర గాయంకావడంతో వెంటనే చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతిచెందింది. ఆమె కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తునట్లు రూరల్‌ ఎస్‌ఐ రాజశేఖర్‌ తెలిపారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top