రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి దుర్మరణం


 భువనగిరి అర్బన్ : మండలంలోని మూసుకుంటలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మూసుకుంటకు చెందిన ఇండ్ల బాలయ్య(55) అనే వ్యక్తి శనివారం సొంత పనిపై వేరే చోటకు వెళ్లారు.  రాత్రి 10 గంటల ప్రాంతంలో స్వగ్రామానికి వచ్చే క్రమంలో రోడ్డు క్రాస్ చేస్తుండగా హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం అతని ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలైన బాలయ్యను స్థానికులు గమనించి భువనగిరి   ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి కుమారుడు ఇండ్ల రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు రూరల్ ఎస్‌ఐ శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు.

 

 యాదగిరిగుట్ట : మండలంలోని వంగపల్లి గ్రామ శివారులో ఆదివారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎస్‌ఐ నర్సింహరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.హైదరాబాద్‌లోని కిషన్‌బాగ్‌కు చెందిన ఎంఏ ఫియాజుద్దీన్ ( 30 ) మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి సొంత పనులపై  కారులో ఖాజీపేటకు వెళ్లాడు. తిరుగుప్రయాణంలో వంగపల్లి శివారులోని పైపుల కంపెనీ వద్ద రోడ్డు పక్కన నిలిపి ఉన్న లారీని గమనించకుండా ఢీకొట్టారు.   ఈ ఘటనలో ఫియాజుద్దీన్ అక్కడికక్కడే మృతి చెందగా కారులో ఉన్న  మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను భువనగిరికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top