అప్పుల బాధతో ఇద్దరు రైతుల బలవన్మరణం
బచ్చన్నపేట (వరంగల్): వర్షాభావ పరిస్థితులతో సాగుచేసిన పంటలు ఎండిపోతుండడం.. అప్పుల బాధతో మనస్తాపానికి గురైన ఇద్దరు రైతులు ఆదివారం బలవన్మరణానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వరంగల్ జిల్లా బచ్చన్నపేటకు చెందిన బావండ్లపల్లి దశరథ(50) తనకున్న నాలుగు ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటున్నాడు. ఖరీఫ్లో రూ.40 వేలు ఖర్చు చేసి పత్తి, వరి సాగు చేశాడు. వర్షాలు కురవక పోవడంతో నారు, పత్తి మొలకలు ఎండిపోయే దశకు చేరుకుంటున్నాయి. దీనికి తోడు గతంలో చేసిన అప్పులు రూ.3 లక్షలకు పెరిగిపోవడంతో మనస్తాపానికి గురై వ్యవసాయ బావి వద్ద చింతచెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామానికి చెందిన గుత్తి భీరయ్య(45) మూడు ఎకరాల్లో వరి సాగు చేస్తుండగా... వర్షాభావంతో వరిపంట ఎండిపోయే దశకు చేరుకోగా, సాగుకోసం చేసిన అప్పులు రూ.3.50లక్షలకు పెరిగిపోయాయి. దీంతో తాగుడుకు బానిసై పొలం వద్ద జామ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహ్యత చేసుకున్నాడు.