రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
కతలాపూర్ (కరీంనగర్ జిల్లా) : వేగంగా వెళ్తున్న ట్రాక్టర్.. ఆటోను ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు ప్రయాణీకులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన సోమవారం కరీంనగర్ జిల్లా కతలాపూర్ మండలంలోని శిరికొండ సమీపంలో జరిగింది. వివరాల ప్రకారం..కోట్ల నుంచి కోరుట్లకు ప్రయాణీకులతో వెళ్తున్న ఆటోను ట్రాక్టర్ ఢీ కొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న మహమ్మద్ బాషా(35), మరో వ్యక్తి(వివరాలు తెలియాల్సి ఉంది) మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడినవారిని కోరుట్ల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్మార్టం కోసం తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా డ్రైవర్ పెద్ద శబ్ధంతో పాటలు వింటూ ట్రాక్టర్ నడపడమే ఈ ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.