ఆర్టీసీ బస్సు, డీసీఎం వ్యాన్ ఢీ
చింతపల్లి (నల్గొండ జిల్లా) : నల్గొండ జిల్లా చింతపల్లి శివారులో ఆదివారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ నుంచి వినుకొండకు వెళుతున్న ఏపీ 29 జడ్ 3538 నంబర్ గల ఆర్టీసీ బస్సు, మల్లేపల్లి నుంచి హైదరాబాద్కు వెళ్తున్న ఏపీ 29యు 2789 నంబరు గల డీసీఎం వ్యాన్ ఢీకొన్నాయి.
ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న కుర్మేడు గ్రామానికి చెందిన యాదగిరి, దేవరకొండకు చెందిన వెంకటరెడ్డి అక్కడికక్కడే మృతిచెందారు. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించారు. క్షతగాత్రులను చింతపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చింతపల్లి పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.