రెండు కంప్యూటర్లు మాయం
సుల్తానాబాద్ (కరీంనగర్): కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలోని ఉన్న ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కార్యాలయంలో 6 కంప్యూటర్లు ఉన్నాయి. ప్రస్తుతం 3 కంప్యూటర్లే కార్యాలయంలో పని చేస్తున్నట్లు కనబడుతోంది. ఒకటి చెడిపోవడంతో స్టోర్ రూమ్లో ఉంది. 2010లో 3 కంప్యూటర్లు, 2013-14లో 3 కంప్యూటర్లు వచ్చాయి. పనిభారం అధికంగా ఉండడంతో కంప్యూటర్లను అదనంగా ఎన్ఆర్ఈజీఎస్ జిల్లా అధికారులు పంపించారు. విచిత్రమేంటంటే అందులో 3 మాత్రం పని చేయగా రెండు మాయమైనట్లు గుసగుసలు మొదలయ్యాయి.
అధికారులు, సిబ్బంది సహకారంతోనే కంప్యూటర్లు మాయమైనట్లు కనబడుతోంది. ఏడు నెలల క్రితం ఇంటర్నల్ అడిట్కు (ఎన్ఆర్ఈజిఎస్ ఇంటర్నల్ అధికారి) వచ్చినప్పుడు రెండు కంప్యూటర్లు మాయమైనట్లు గ్రహించారు. బయటకు రాకుండా ఉండేందుకు సంబంధిత ఉద్యోగులు ఆయనను మేనేజ్ చేసినట్లు తెలుస్తోంది. ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు ఏసర్ కంపెనీ కంప్యూటర్లను సీపీయూ, మానిటర్లు మార్చి తీసుకువెళ్లి ఇంట్లో వాడుకుంటున్నట్లు తెలిసింది.