సీఐడీ అదుపులో కీలక నిందితుడు రమేష్
హైదరాబాద్ : తెలంగాణ మెడికల్ ఎంసెట్-2 పేపర్ లీకేజీపై సీఐడీ దర్యాప్తు వేగవంతమైంది. ఇందుకు సంబంధించి కీలక నిందితుడు రమేష్ను బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు బ్రోకర్లుగా చెలామణి అయిన వారిలో ఇప్పటి వరకు ఇద్దరిని సీఐడీ అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్కు చెందిన వెంకట్రావ్, ఖమ్మంకు చెందిన మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీఐడీ ప్రత్యేక బృందాలు రహస్య ప్రదేశంలో విచారిస్తున్నాయి. కాగా నిన్న ప్రకాశం జిల్లా కనిగిరిలో ఖాసిం అనే వ్యక్తిని విచారించి వదిలివేసిన విషయం తెలిసిందే.
ఎంసెట్-2లో అనూహ్యంగా ర్యాంకులు సాధించిన 60 మంది విద్యార్థుల ట్రాక్ రికార్డును సీఐడీ క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. జేఎన్టీయూ ఇచ్చిన 60 మంది విద్యార్థుల ర్యాంకుల జాబితాను పూర్తిగా పరిశీలించింది. వారి నుంచి సేకరించే వివరాలను అధికారికంగా నమోదు చేసుకునేందుకు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు వివిధ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులను విచారించేందుకు సీఐడీ ప్రత్యేక బృందాలు వరంగల్, భూపాలపల్లి, పరకాల, ఖమ్మం, కరీంనగర్ ప్రాంతాలకు వెళ్లాయి.