చేజారిపోకుండా!


సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ప్రాదేశిక ఎన్నికల్లో అత్యధిక జెడ్పీటీసీ స్థానాలను గెలుపొందిన టీఆర్‌ఎస్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పీఠాన్ని కైవసం చేసుకునే దిశగా పావు లు కదుపుతోంది. భారీ మెజారిటీ వచ్చినప్పటికీ, గెలిచిన సభ్యులు జారి పోకుండా ముందు జాగ్రత్త పడుతోంది. చైర్‌పర్సన్ ఎన్నికకు ఇంకా సమయం ఉండటంతో అప్పటి వరకు జెడ్పీటీసీలను కట్టడి చేసే ఏర్పాట్లలో ఉంది. ఈ మేరకు బాసరలోని ఓ ప్రైవేటు లాడ్జిలో టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన 38 మంది జెడ్పీటీసీలతో సమావేశం నిర్వహించారు.



మంగళవారమే ఒక్కొక్కరు బాసరకు చేరుకున్న టీఆర్‌ఎస్ జెడ్పీటీసీలు ఇక్కడి నుంచి క్యాంపునకు తరలివెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా షిర్డీయాత్రకు వెళ్తున్నట్లు సమాచారం. బాసరలో జరిగి న ఈ సమావేశంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు వేణుగోపాలాచారి, జోగు రామన్న, నల్లాల ఓదేలు, శ్రీహరిరావు, ఎంపీ అభ్యర్థి గొ డం నగేష్, పశ్చిమ జిల్లా అధ్యక్షులు లోక భూమారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్‌పర్సన్ ఎన్నిక సమయంలో వ్యవహరించాల్సిన తీరుపై జెడ్పీటీసీలతో చర్చించినట్లు సమాచారం.



 ముగ్గురి మధ్య పోటీ

 చైర్‌పర్సన్ ఎన్నిక విషయంలో పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయమే కీలకం అయినప్పటికీ, పలువురు జెడ్పీటీసీలు చైర్‌పర్సన్ పదవి కోసం ప్రయత్నా లు  ముమ్మరం చేస్తున్నారు. ముఖ్యంగా ముగ్గురి పేర్లు వినిపిస్తున్నాయి. మంచిర్యాల జెడ్పీటీసీ ఆ శలత, నిర్మల్ జెడ్పీటీసీ శోభలతోపాటు, నార్నూ ర్ జెడ్పీటీసీ రూపావతి పుష్కర్‌ల పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఈ ముగ్గురు జెడ్పీటీసీలు ఇప్పటికే అధినేత కేసీఆర్‌ను కలిసి చైర్‌పర్సన్ పదవికి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.



 ఈ ముగ్గురు ఫలి తాలు వెలువడక ముందు నుంచే ముమ్మర ప్ర యత్నాలు చేస్తున్నారు. కాగా తమకు మద్దతిచ్చిన సభ్యులకు భారీ మొత్తంలో నగదు, చైర్‌పర్సన్ గె లిచిన వెంటనే ఒక్కో మండలానికి రూ.10లక్షల అంచనా వ్యయం గల అభివృద్ధి పనులు ఇస్తామ ని బేరసారాలకు దిగినట్లు సమాచారం. కేవలం జెడ్పీటీసీల మద్దతే కాకుండా, ఆయా నియోజకవర్గాల్లోన్ని ఎమ్మెల్యే అభ్యర్థుల మద్దతును కూడా కూడగట్టేందుకు రేసులో ఉన్న నాయకులు పావు లు కదుపుతున్నారు. జిల్లాలో మొత్తం 52 జెడ్పీటీసీ స్థానాలున్నాయి. 27మంది జెడ్పీటీసీల మద్దతుంటే జెడ్పీ పీఠాన్ని దక్కించుకోవచ్చు. కానీ 38 చోట్ల టీఆర్‌ఎస్ అభ్యర్థులు విజయం సాధించా రు. కాంగ్రెస్ కేవలం పది స్థానాలకే పరిమితమైన విషయం విధితమే. అయితే చైర్‌పర్సన్ పీఠం చేజారిపోయే అవకాశాలు ఏమాత్రం లేకపోయినప్పటికీ టీఆర్‌ఎస్ ఆచితూచి వ్యవహరించడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top