'బీజేపీ ఎమ్మెల్యేల తీరు దుర్మార్గం'
హైదరాబాద్: అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేల ప్రవర్తన దుర్మార్గంగా ఉందని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యే గాదరి కిషోర్ మాట్లాడుతూ.. విరోధులైన కాంగ్రెస్, బీజేపీ తెలంగాణ అసెంబ్లీలో కుమ్మక్కు కావడం విచిత్రమన్నారు. కావాలనే అసెంబ్లీ సమావేశాన్ని బీజేపీ అడ్డుకోవాలని చూసిందని ఆరోపించారు.
మంత్రి జగదీష్ రెడ్డి ప్రధానమంత్రి మోదీని ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని తెలిపారు. మైకు తీసుకుని మాట్లాడే అవకాశమున్నా బీజేపీ సభ్యులు పోడియం దగ్గరకు వచ్చి మంత్రిని దుర్భాషలాడారని విమర్శించారు. మంత్రి జగదీష్ రెడ్డికి బీజేపీ సభ్యులు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.