చిన్నారిని చిదిమేసిన ట్రాక్టర్
కేసముద్రం : చూడగానే ముద్దొచ్చే ఆ చిన్నారిని ఎత్తుకోని వారుండరూ.. ముద్దు ముద్దు ముచ్చట్లతో అప్పటివరకు ఇళ్లంతా సందడి చేసిన బాలిక కానరానిలోకాలకు వెళ్లిపోయింది. హృదయ విషాదకర సంఘటన మండలంలోని కల్వల గ్రామశివారు గాంధీపురంలో ఆదివారం జరిగింది. ఎస్సై ఫణిధర్ కథనం ప్రకారం.. మండలంలోని రంగాపురం గ్రామానికి చెందిన మాలోతు రవి, సౌందర్య దంపతులకు ఇద్దరు కవలలు భానుప్రియ (లల్లీ) (3), కుమారుడు భరత్ ఉన్నారు. అయితే రవి కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కాగా, కల్వల శివారు గాంధీపురానికి చెందిన తన అక్క, బావ కల్యాణి, శంకర్లు ఇదే మండలంలోని తాళ్లపూసపల్లిలోని శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద శనివారం జరిగే జాతరలో పండుగ చేసుకుంటుండగా.. రవి దంపతులను ఆహ్వానించారు.
అయితే రవి తన భార్య, ఇద్దరు పిల్లలు, తల్లి సాలిని పండుగకు పంపించి అతడు ఇంటివద్దే ఉన్నాడు. కాగా, ఆలయం వద్ద పండుగ జరుపుకున్న తర్వాత సౌందర్య తన అత్త, ఇద్దరు పిల్లలతో కలిసి గాంధీపురానికి వచ్చింది. అయితే అదే రోజు సాయంత్రం సాలి తాను ఇంటికి వెళ్తానని చెప్పి మనవడు భరత్ను తీసుకుని రంగాపురానికి వె ళ్లింది. అయితే సౌందర్యను బంధువులు ఉండమని చెప్పడంతో తన కూతురు భానుప్రియతో అక్కడే ఆగిపోయింది. కాగా, ఆదివారం మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత భానుప్రియను మేనత్త, మామలు ఎత్తుకుని అప్పటిదాకా ఆడించారు.
అక్కడికక్కడే..
అయితే అప్పటివరకు కోడలిని ఎత్తుకున్న శంకర్ ఇంటి ముందున్న ట్రాక్టర్ను వెనక్కి తీసేందుకు స్టార్ట చేశాడు. కాగా, మామ వెనకాలే వచ్చిన భానుప్రియ ట్రాక్టర్ వెనక భాగంలో నిల్చుండిపోయింది. గమనించని శంకర్ ట్రాక్టర్ను ఒక్కసారిగా వెనక్కి తీయడంతో భానుప్రియ చక్రం కిందపడి అక్కడికక్కడే మృతిచెందింది. ఇదిలా ఉండగా, అప్పటివరకు తమకు ముద్దుముద్దు ముచ్చట్లు చెప్పిన కూతురు విగతజీవిలా మారడంతో తల్లి, బంధువులు గుండలవిసేలా రోదించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.