కాంగ్రెస్ గెలిస్తేనే టీఆర్ఎస్ దిగొస్తుంది: టీపీసీసీ
సాక్షి, హైదరాబాద్:ప్రజా వ్యతిరేక నిర్ణయాలను అమలు చేయడంలో దూకుడుగా ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కట్టడి చేయాలంటే మెదక్ లోక్సభ ఉప ఎన్నికలో కాంగ్రెస్ను గెలిపించాలని ప్రజలకు టీపీసీసీ విజ్ఞప్తి చేసింది. తమను గెలిపిస్తే రుణమాఫీ వంటి హామీల అమలుతోపాటు కరెంట్ సమస్యలకు పరిష్కారానికి ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెస్తామని పేర్కొంది. సోమవారమిక్కడి గాంధీభవన్లో టీపీసీసీ అధికార ప్రతినిధులు మల్లు రవి, జి.నిరంజన్, ప్యాట రమేశ్ మీడియాతో మాట్లాడారు.
అది ఎన్నికల కోడ్కు విరుద్ధం...
మెదక్ ఉప ఎన్నికల పరిధిలో రుణమాఫీ జాబితాను గ్రామ పంచాయతీల్లో ప్రకటించడం ఎన్నికల కోడ్ను ఉల్లంఘించడమేనని టీపీసీసీ క్రమశిక్షణా సంఘం చైర్మన్ ఎం.కోదండరెడ్డి, అధికార ప్రతినిధి జి.నిరంజన్ పేర్కొన్నారు. కోడ్ ఉల్లంఘనకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి భన్వర్లాల్కు ఫిర్యాదు చేశారు.
‘కేసీఆర్ మాటలకు, చేతలకు పొంతనేదీ?’
‘సీఎం కేసీఆర్ మాటలు కోటలు దాటుతున్నాయని, కాళ్లు మాత్రం క్యాంపు ఆఫీస్ దాటడం లేదని టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య అన్నారు. సోమవారం మెదక్ జిల్లా దుబ్బాకలో ఆయన మాట్లాడారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఇప్పటి వరకు చేసిం దేమీ లేదన్నారు. ఎన్నికల్లో మోసపోయామని ప్రజలు బాధపడుతున్నారన్నారు.