దారిలో అడ్డగించి.. నాలుక కోశారు
మణుగూరురూరల్(పినపాక): మణుగూరు మండలంలోని రామానుజవరం గ్రామ ప్రధాన రహదారిపైన నడుచుకుంటూ వెళుతున్న ఓ వ్యక్తిని గుర్తుతెలియని ఐదుగురు వ్యక్తులు అటకాయించి, నాలుక కోసి పారిపోయారు. ఇది, శుక్రవారం మధ్యాహ్నం జరిగింది.
చర్ల మండలం గీసరవెల్లికి చెంది న గుమ్మల రవి, ఐదేళ్ల క్రితం మణుగూరు మండలం చిక్కుడు గుంట గ్రామానికి చెందిన మునిగల కిట్టయ్య కూతురు సమ్మక్కను వివాహం చేసుకున్నాడు. ఏడాది క్రితం వీరు విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత కూడా, రవి తరచుగా చిక్కుడుగుంట వస్తూ సమ్మక్కను కొడుతున్నాడు. దీనిపై పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది.
ఈ కేసు విషయమై స్థానిక పెద్దలతో మాట్లాడేందుకు రామానుజవరం వస్తున్న గుమ్మల రవిని రామానుజవరం గ్రామ రహదారిపై గుర్తుతెలియని ఐదుగురు వ్యక్తులు అటకాయించారు. ముసుగు వేసి, నాలుక కోశారు. ఇది జరిగిన స్థలాన్ని ఎస్సైలు నరహరి, కుమారస్వామి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.