మధుకర్‌ మృతదేహానికి రేపు రీపోస్టుమార్టం


సాక్షి, పెద్దపల్లి: మంథని మధుకర్‌ మృతదేహానికి హైకోర్టు ఆదేశాల మేరకు సోమవారం రీపోస్టుమార్టం జరగనుంది. రెవెన్యూ, పోలీసుశాఖ అధికారులు ఖననం చేసిన చోట అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. కరీంనగర్‌ జిల్లా కోర్టు జడ్జి సమక్షంలో ఉస్మానియా, కాకతీయ మెడికల్‌ కళాశాలలకు చెందిన ఫోరెన్సిక్‌ నిపుణులు ఈ పోస్టుమార్టం జరపనున్నారు. ఈ కేసులో సోషల్‌ మీడియాలో జరిగిన.. జరుగుతున్న ప్రచారానికి చెక్‌ పెట్టేందుకు.. మధుకర్‌ కుటుంబసభ్యుల డిమాండ్‌ మేరకు మంథని మధుకర్‌ మృతదేహానికి రీపోస్టుమార్టం చేయాలని నిర్ణయించారు.



కాకతీయ మెడికల్‌ కళాశాల చెందిన నిపుణుల సమక్షంలో ఈ నెల 7న రీపోస్టుమార్టం జరిపేందుకు ఏర్పాట్లు చేశారు. పోలీసులు, రెవెన్యూ అధికారులను నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధి ప్రభావితం చేస్తారని, వీరు చేయించే రీపోస్టుమార్టంపై నమ్మకం లేదని మధుకర్‌ తల్లి లక్ష్మి ఈ నెల 6న హైకోర్టును ఆశ్రయించింది. జడ్జి, ఫోరెన్సిక్‌ నిపుణుల సమక్షంలో రీ పోస్టుమార్టం జరపాలనే ఆమె అభ్యర్థనకు కోర్టు సమ్మతిస్తూ రీపోస్టుమార్టం జరపాలని ఆదేశించింది. దీంతో 10వ తేదీ ఉదయం 8 గంటలకు రీపోస్టుమార్టం చేయనున్నారు. కరీంనగర్‌ జిల్లా జడ్జి సమక్షంలో ఉస్మానియా, కాకతీయ మెడికల్‌ కళాశాలలకు చెందిన ఫోరెన్సిక్‌ నిపుణులు ప్రక్రియ పూర్తి చేయనున్నారు. అక్కడికి మధుకర్‌ తల్లిదండ్రులు లక్ష్మి, ఎల్లయ్యను అనుమతించనున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top