నేడు కాకా అంత్యక్రియలు
హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి(85) అంత్యక్రియలు మంగళవారం మధ్యాహ్నం జరగనున్నాయి. ఈ రోజు ఉదయం 11 గంటలకు వెంకటస్వామి భౌతికకాయాన్ని గాంధీభవన్కు తరలించనున్నారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నివాళులు అర్పించనున్నారు. అభిమానుల సందర్శనార్థం వెంకటస్వామి భౌతికకాయాన్ని ఊరేగింపుగా పంజగుట్ట శ్మశా న వాటికకు తీసుకువెళ్లి మధ్యాహ్నం రెండు గంటలకు అంత్యక్రియలు నిర్వహిస్తారు. కాకా అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశించారు. వెంకటస్వామి మృతికి ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
కార్మిక నేతగా ప్రస్థానం ప్రారంభించి కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగిన వెంకటస్వామి.. సోమవారం రాత్రి 8.40 గంటలకు హైదరాబాద్లోని కేర్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, ప్రజా గాయకుడు గద్దర్, మాజీ ఎంపీలు రాజయ్య, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే వంశీచంద్రెడ్డి తదితరులు వెంకటస్వామి భౌతికకాయం వద్ద నివాళులర్పించారు. రాత్రి పొద్దుపోయిన తర్వాత వెంకట స్వామి మృతదేహాన్ని సోమాజిగూడలోని వివేక్ ఇంటికి తరలించారు.